న్యూఢిల్లీ: మెడికల్ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ – NEET (UG) 2021, సెప్టెంబర్ 12న దేశ వ్యాప్తంగా జరుగుతుందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సోమవారం ప్రకటించారు. మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి ఎన్టీఏ వెబ్సైట్ల ద్వారా దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. కరోనా నిబంధనలు పాటించి నీట్ పరీక్ష నిర్వహిస్తామని అన్నారు. సామాజిక దూరం నిబంధనకు అనుగుణంగా పరీక్ష నిర్వహించే నగరాల సంఖ్యను 155 నుంచి 198కి పెంచినట్లు ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. అలాగే పరీక్షా కేంద్రాల సంఖ్యను కూడా పెంచినట్లు వివరించారు. పరీక్షకు హాజరయ్యే ప్రతి అభ్యర్థికి పరీక్షా కేంద్రం వద్ద మాస్క్ ఇవ్వనున్నట్లు తెలిపారు. కరోనా నిబంధనలకు అనుగుణంగా శానిటైజేషన్, సీటింగ్ ఏర్పాట్లు జరుగుతాయని ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు.