ముంబై : క్రూయిజ్ డ్రగ్ కేసులో ఆర్యన్ఖాన్కు బెయిల్ వచ్చినా.. ఈ విషయం ఇప్పుడే ఇంకా చల్లారేలా కనిపించడం లేదు. బెయిల్పై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో సుప్రీం కోర్టుకు వెళ్లనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇందు కోసం హైకోర్టు బెయిల్ ఆర్డర్ను పరిశీలించి, న్యాయవాది అభిప్రాయాన్ని తీసుకుంటున్నట్లు పేర్కొన్నాయి. డ్రగ్స్ కేసులో అక్టోబర్ 28న జస్టిస్ సాంబే సింగిల్ బెంచ్ ఆర్యన్ఖాన్, అర్బాజ్ మర్చంట్, మున్మున్ ధమేచా బెయిల్ ఇచ్చింది. దీనిపై గత శనివారం వివరణాత్మక కాపీని బాంబే హైకోర్టు విడుదల చేసింది. ఇందులో ఆర్యన్ఖాన్ వద్ద ఎలాంటి వస్తువులు దొరకలేదని హైకోర్టు పేర్కొంది.
ఆర్యన్ ఫోన్లో కనిపించిన వాట్సాప్ చాట్లో ‘ముగ్గురు నిందితులు ఇతర సహ నిందితులతో కుట్ర’ సంబంధాన్ని సూచించలేదని, నిందితుడి ఫోన్ వాట్సాప్ చాట్లో, అర్బాజ్ మర్చంట్, మున్మున్ ధమేచాలు ఈ నేరానికి కుట్ర పన్నారని సూచించడానికి ఎలాంటి ఆధారాలు దొరకలేదని, అంతే కాదు ముగ్గురికి మెడికల్ చెకప్ కూడా చేయలేదని కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) నిందితులందరి కేసును కలిసి పరిగణలోకి తీసుకోవాలని వాదించింది.
దీన్ని తోసిపుచ్చిన న్యాయస్థానం, ముగ్గురు నిందితులు ఉమ్మడి ఉద్దేశ్యంతో చట్టవిరుద్ధమైన చర్యకు సిద్ధంగా ఉన్నారని అర్థం చేసుకోవడానికి ముందు రికార్డుల్లో ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొంది. నిందితులు ముగ్గురూ ఒకే క్రూయిజ్ నౌకలో ఉండడం ఒక్కటే వారు తప్పు చేశారనడానికి ఆధారం కాబోదని బాంబే హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ క్రమంలో బాంబే హైకోర్టు వివరణాత్మక ఉత్తర్వు నేపథ్యంలో ఆర్యన్ఖాన్తో పాటు పలువురిపై పెట్టిన డ్రగ్స్ కేసు ఉట్టిదేనని మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ పేర్కొన్నారు. అదే సమయంలో ఎన్సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడేను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.