Amarinder Singh | పంజాబ్ కాంగ్రెస్ ప్రదేశ్ కమిటీ (పీసీసీ) అధ్యక్షుడు నవ్జ్యోత్ సింగ్ సిద్దూపై ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్ నిప్పులు చెరిగారు. సిద్దూకు దిమాక్ ( no brains )
లేదని వ్యాఖ్యానించారు. ఐదేండ్ల క్రితమే పార్టీలోకి సిద్దూను తీసుకుంటున్నప్పుడు కూడా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీకి.. ఇటువంటి అసమర్థుడిని తీసుకోవద్దని సూచించానని చెప్పుకొచ్చారు. ప్రస్తుత సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీ, ఇతర కాంగ్రెస్ పార్టీ నేతలు చట్ట విరుద్ధంగా ఇసుక మైనింగ్ చేస్తున్నారని తెలిసినా తాను సీఎంగా చర్య తీసుకోలేదన్నారు. దీనికి పార్టీ పట్ల విధేయతతోపాటు వారిపై చర్య తీసుకోవడానికి సోనియాగాంధీ అనుమతించక పోవడం కారణం అని అన్నారు.
వచ్చేనెల 20న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసే 22 మంది అభ్యర్థుల తొలి జాబితాను ఆదివారం అమరిందర్ సింగ్ మీడియాకు విడుదల చేశారు. ప్రస్తుత సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీకి వ్యతిరేకంగా ఒక మహిళా ఐఏఎస్ అధికారి #మీటూ కేసు ఫిర్యాదు చేసినా చర్య తీసుకోలేదన్నారు. బీజేపీతోపాటు శిరోమణి అకాలీదళ్ (సంయుక్త్)తో కూటమిగా అమరిందర్ సింగ్ సారధ్యంలోని పంజాబ్ లోక్ కాంగ్రెస్ పోటీ చేస్తున్నది.