త్రిపుర: కొండచరియలు విరిగిపడటం వల్ల భూమి కుంగడంతో మూడు అంతస్తుల ప్రభుత్వ భవనం కుప్పకూలింది. అయితే ఆ బిల్డింగ్ సురక్షితం కాదని ముందుగానే నిర్ధారించి ఖాళీ చేయడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరుగలేదు. ప్రభుత్వ భవనం క్షణాల్లో కూలిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. (Nagaland Government Building Collapses) నాగాలాండ్లోని టుయెన్సాంగ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. భారీ వర్షాల వల్ల కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో జిల్లా రవాణా కార్యాలయం (డీటీవో) భవనం ఉన్నచోట భూమి కుంగసాగింది. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం అది కుప్పకూలింది.
కాగా, జూలై 23న ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాల కారణంగా డీటీవో భవనానికి తీవ్ర నష్టం వాటిల్లింది. తక్షణమే కూలిపోయే ప్రమాదం ఉన్నట్లు నిర్మాణ, సాంకేతిక తనిఖీలో తేలింది. దీంతో టుయెన్సాంగ్ డిప్యూటీ కమిషనర్ అత్యవసర కూల్చివేతకు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో జూలై 24 నుంచి ఆ డీటీవో కార్యాలయాన్ని మూసివేశారు. డ్రైవింగ్ లైసెన్సుల జారీ, వాహన రిజిస్ట్రేషన్, పన్ను వసూలు, పర్మిట్లు, ఇతర ప్రజా సేవలతో సహా మోటారు వాహన సంబంధిత సేవలన్నీ నిలిపివేశారు.
అయితే తాజా వర్షాలకు అక్కడి భూమి మరింత కుంగడంతో ఆ భవనం కుప్పకూలింది. ముందుగానే ఖాళీ చేయించడం వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదని అధికారులు తెలిపారు. నిరాశ్రయులైన స్థానిక ప్రజలను శిబిరాలకు తరలించినట్లు చెప్పారు. మూడంతస్తుల డీటీవో భవనం కుప్పకూలిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
The DTO office building collapsed after being struck by a massive flash flood in the Nepal–Tibet area pic.twitter.com/P9Y1CVuGst
— Surajit (@surajit_ghosh2) August 27, 2026