పట్నా: కేంద్ర మాజీ మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ తనయుడు, లోక్ జనశక్తి పార్టీ అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ తన పార్టీలో తిరుగుబాటుపై మరోసారి స్పందించారు. తన వాళ్లే తనకు ద్రోహం చేశారని వ్యాఖ్యానించారు. ఈ ఉదయం ఆయన బీహార్లోని హాజీపూర్ నుంచి ఆశీర్వాద్ యాత్ర ప్రారంభించారు. హాజీపూర్ తన తండ్రి పనిచేసిన ప్రాంతం కావడంతో తాను అక్కడి నుంచి యాత్ర మొదలుపెట్టానని చిరాగ్ చెప్పారు.
బీహార్లోని ప్రతి జిల్లాలో తన ఆశీర్వాద్ యాత్ర కొనసాగుతుందని చిరాగ్ పాశ్వాన్ వెల్లడించారు. ఈ యాత్ర ద్వారా రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి నుంచి ఆశీర్వాదం తీసుకోవాలన్నదే తన ముఖ్య ఉద్దేశమని చెప్పారు. అంతేతప్ప ఎవరికో తన బలం చూపించాలన్న ఉద్దేశం తనకు లేదని చెప్పారు. ఇటీవల చిరాగ్ పాశ్వాన్ పార్టీకి చెందిన నలుగురు ఎంపీలు తిరుగుబాటు చేశారు. అయితే, ముఖ్యమంత్రి నితీశ్కుమార్ కుట్రతోనే ఈ తిరుగుబాటు జరిగిందని చిరాగ్ ఆరోపించారు.