హైదరాబాద్ : కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ర్టంలోని ప్రభుత్వ, ప్రయివేటు విద్యాసంస్థలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శాసనసభ వేదికగా ప్రకటన చేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఉస్మానియా యూనివర్సిటీతో పాటు మిగతా యూనివర్సిటీలకు కూడా అధికారులు సెలవులు ప్రకటించారు. అన్ని డిగ్రీ, పీజీ పరీక్షలను కూడా వాయిదా వేశారు.
ఈ క్రమంలో ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అన్ని హాస్టళ్లను గురువారం మధ్యాహ్నం నుంచి మూసివేస్తున్నట్లు ఓయూ చీఫ్ వార్డెన్ డాక్టర్ కొర్రెముల శ్రీనివాస్ ప్రకటించారు. ఇవాళ లంచ్ అనంతరం హాస్టళ్లను మూసివేయనున్నారు. ఇప్పటికే పలువురు విద్యార్థులు తమ హాస్టళ్లను ఖాళీ చేశారు. మిగిలిన విద్యార్థులను ఖాళీ చేయించేందుకు ఓయూ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.