శివపురి: ఆడపిల్లలను కన్నదన్న కోపంతో భర్త, అత్తమామలు ఓ మహిళను అత్యంత దారుణంగా హత్యచేశారు. మధ్యప్రదేశ్లోని శివపురి జిల్లా దిండోలి గ్రామంలో గురువారం ఈ ఘటన చోటుచేసుకున్నది. వివరాల్లోకి వెళ్తే.. దిండోలి గ్రామానికి చెందిన సావిత్రి భగేల్, రతన్సింగ్ ఇద్దరూ భార్యభర్తలు. వీరికి నలుగురు ఆడపిల్లలు. మూడు నెలల క్రితమే నాలుగో ఆడపిల్ల జన్మించింది.
వరుసగా నాలుగో కాన్పులో కూడా ఆడపిల్లే జన్మించడంతో సావిత్ర భగేల్కు భర్త రతన్సింగ్ వేధింపులు అధికమయ్యాయి. అతనికి తండ్రి కిలోల్డ్ సింగ్, తల్లి బేనూ బాయ్ కూడా సహకరించేవారు. ఈ క్రమంలోనే గురువారం కూడా సావిత్రి భగేల్పై చేయిచేసుకున్న రతన్సింగ్.. అంతటితో ఆగక తన తండ్రి, తల్లితో కలిసి ఆమె గొంతు నులిమి చంపేశాడు.
ఘటనపై బాధితురాలి సోదరుడు కృష్ణ భగేల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన సోదరికి పెండ్లయిన కొత్తలో నుంచే అదనపు కట్నం కోసం అత్తింటి వారి వేధింపులు మొదలయ్యాయని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఆ తర్వాత ఆడపిల్లలనే కంటున్నావంటూ వేధించడం మొదలుపెట్టారని తెలిపాడు. కృష్ణ భగేల్ ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.