భోపాల్: సైకిల్ రిపేర్ చేసే సాధారణ వ్యక్తి కుమార్తెను ఆస్ట్రేలియా జాతీయుడు పెళ్లి చేసుకున్నాడు. హిందూ సాంప్రదాయం ప్రకారం వారి వివాహం జరిగింది. ఈ జంటకు పరిచయం అయిన తీరు సినిమా కథను తలపిస్తున్నది. మధ్యప్రదేశ్లోని మనావర్కు చెందిన సాదిక్ హుస్సేన్, స్థానిక బస్టాండ్ సమీపంలోని సైకిల్ రిపేర్ షాపులో మెకానిక్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆయన భార్య గృహిణి. వీరికి ఐదుగురు సంతానం. ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు.
కాగా, సైకిల్ మెకానిక్ సాదిక్ హుస్సేన్ మూడో కుమార్తె తబస్సుమ్ హుస్సేన్ విద్యలో ఉన్నతంగా రాణించింది. దీంతో విదేశాల్లో ఉన్నత విద్య కోసం మధ్యప్రదేశ్ ప్రభుత్వం రూ.45 లక్షల గ్రాంట్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో 2016లో ఆమె ఆస్ట్రేలియాకు వెళ్లింది. 2017లో ఉన్నత విద్య కోసం బ్రిస్బేన్ నగరానికి చేరింది. అక్కడ కాలేజీలో చదువుతుండగా సీనియర్ అయిన యాష్ హాన్స్చైల్డ్తో తబస్సుమ్కు పరిచయం ఏర్పడింది. ఇది వీరిద్దరి మధ్య ప్రేమకు దారి తీసింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఆగస్ట్ 2న వారిద్దరూ అక్కడ కోర్టు ద్వారా పెళ్లి చేసుకున్నారు.
అనంతరం ఈ జంట మధ్యప్రదేశ్లోని మనావర్కు చేరుకుంది. యాష్ తల్లి కూడా వారి వెంట వచ్చింది. అయితే భారత్ సంస్కృతి, సంప్రదాయానికి యాష్ ముగ్దుడయ్యాడు. ఈ నేపథ్యంలో ఈ నెల 18న తబస్సుమ్, యాష్ హిందూ సంప్రదాయం ప్రకారం మరోసారి పెళ్లి చేసుకున్నారు. దీంతో ఈ జంట లవ్ స్టోరి, పెళ్లి వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. వధువు తబస్సుమ్ ప్రస్తుతం బ్రిస్బేన్లోని ఒక సంస్థలో సీనియర్ మేనేజర్గా పని చేస్తున్నది.