భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రం రేవా జిల్లా చుచియారీ బెహెరా గ్రామంలో ఘోరం జరిగింది. ఇల్లు కూలి (House collapse ) ఓకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో ఓ 35 ఏండ్ల వ్యక్తి, అతని 60 ఏండ్ల తల్లి, 7, 8 సంవత్సరాల వయసున్న ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మరో బాలిక తీవ్రంగా గాయపడింది. గ్రామస్తులు ఇచ్చిన సమాచారం మేరకు ఆస్పత్రికి చేరుకున్న అధికారులు, పోలీసులు స్థానికుల సాయంతో గాయపడిన బాలికను వెలికితీసి చికత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
అనంతరం మృతదేహాలను వెలికి తీసి పోస్టుమార్టానికి పంపారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఇంటి చుట్టూ నీరు నిలిచి బురద పేరుకుపోయిందని, దాంతో గోడలు నానిపోయి ఇల్లు కూలిందని అధికారులు అంచనా వేశారు. అదేవిధంగా భారీ వరదల కారణంగా పలుచోట్ల రోడ్లు తెగిపోవడంతో పోలీసులు, రెస్క్యూ సిబ్బందికి ఘటనా ప్రాంతానికి చేరుకోవడం ఆలస్యమైందని అధికారులు తెలిపారు.