చండీగఢ్: దివ్యాంగ భర్తను భార్య హేళన చేయడం, కొట్టి హింసించడం అత్యంత అమానవీయ క్రూరత్వమని పంజాబ్, హర్యానా హైకోర్టు పేర్కొంది. కింద కోర్టు ఉత్తర్వులను తోసిపుచ్చి అతడికి విడాకులు మంజూరు చేసింది. భార్య కలిగిస్తున్న మానసిక, శారీరక క్రూరత్వం కారణంగా విడాకుల కోసం 18 ఏళ్లుగా న్యాయపోరాటం చేస్తున్న పోలియో రోగికి ఊరటనిచ్చింది. ఒక వ్యక్తికి చిన్నతనం నుంచి పోలియో వల్ల కాళ్లు చచ్చుబడ్డాయి. దివ్యాంగుడైన అతడికి 2004 మార్చిలో ఒక మహిళతో పెళ్లైంది. ఆ దంపతులకు ఆ ఏడాది డిసెంబర్లో ఒక కొడుకు పుట్టాడు.
కాగా, దివ్యాంగుడైన ఆ వ్యక్తిని అతడి భార్య పెళ్లైన పదో రోజు నుంచి మానసికంగా, శరీరకంగా వేధిస్తున్నది. అతడి వైకల్యాన్ని హేళన చేస్తూ అందరి ముందు తిట్టడంతోపాటు, ఊత కర్రలు లాగేసి తోసి కింద పడేసి కొడుతున్నది. అతడి పురుషత్వాన్ని కూడా ఎగతాళి చేస్తున్నది. ఆమె వేధింపులు భరించలేక ఆ వ్యక్తి తల్లిదండ్రులు అతడ్ని వేరు చేశారు. భార్య చిత్రహింసలు భరించలేని ఆ దివ్యాంగ భర్త విడాకుల కోసం హోషియార్పూర్ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు. అయితే భార్య వేధింపులు విడాకులకు కారణం కాదన్న ఆ కోర్టు విడాకులు మంజూరు చేసేందుకు నిరాకరించింది.
దీంతో ఆ దివ్యాంగ వ్యక్తి పంజాబ్, హర్యానా హైకోర్టును ఆశ్రయించాడు. కింద కోర్టు ఉత్తర్వులను పైకోర్టులో సవాల్ చేశాడు. తన వైకల్యాన్ని హేళన చేస్తూ తిట్టడంతోపాటు, ఊత కర్రలు లాగేసి భార్య కొడుతున్నదని ఆరోపించాడు. నిత్యం తనను మానసికంగా, శరీరకంగా క్రూరంగా హింసిస్తున్న భార్య నుంచి విడాకులు మంజూరు చేయాలని కోర్టును అభ్యర్థించాడు.
ఆ పిటిషన్ను పరిశీలించిన హైకోర్టు ఆ దివ్యాంగ భర్త తన భార్య వల్ల అనుభవిస్తున్న నరకయాతనపై ఆవేదన వ్యక్తం చేసింది. ‘ఒక వ్యక్తి వైకల్యం గురించి అవహేళన చేయడం, అందరి ముందు అవమానించడం, నిస్సహాయంగా, తనను తాను రక్షించుకోలేని స్థితిలో ఉన్నప్పుడు నేలపైకి నెట్టేయడం, కొట్టడం అత్యంత అమానవీయమైన క్రూరత్వం’ అని డివిజన్ బెంచ్ పేర్కొంది. హోషియార్పూర్లోని కుటుంబ న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వును రద్దు చేస్తూ ఆ వ్యక్తికి విడాకులు మంజూరు చేసింది.