న్యూఢిల్లీ: భారత్ నిర్వహించిన ‘సూర్య నమస్కార్’ కార్యక్రమానికి భారీ స్పందన లభించింది. ప్రపంచవ్యాప్తంగా 75 లక్షలకుపైగా ప్రజలు ఇందులో పాల్గొన్నారు. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏండ్లు అయిన సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరుతో కేంద్ర ప్రభుత్వం ఏడాదిపాటు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగా ఆయుష్ మంత్రిత్వ శాఖ మకర సంక్రాతిని పురస్కరించుకుని శుక్రవారం వర్చువల్గా ‘సూర్య నమస్కార్’ కార్యక్రమాన్ని నిర్వహించింది.
కేంద్ర ఆయుష్ మంత్రి సర్బానంద సోనోవాల్, కేంద్ర సహాయ మంత్రి ముంజపర మహేంద్రభాయ్ దీనిని ప్రారంభించారు. ‘సూర్య నమస్కారం ద్వారా సూర్యారాధన జరుగుతుంది. ప్రజల శారీరక, మానసిక శ్రేయస్సును ఇది మెరుగుపరుస్తుంది’ అని కేంద్ర మంత్రి సోనోవాల్ ఈ సందర్భంగా అన్నారు. మానవ జాతి ఆరోగ్యం, సంక్షేమం కోసం ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో యోగా, సూర్య నమస్కారాలను ప్రచారం చేస్తున్నట్లు చెప్పారు. సూర్య నమస్కారాలు రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయని, శరీరాన్ని ఫిట్గా ఉంచుతాయని పరిశోధనలు వెల్లడిస్తున్నాయని కేంద్ర మంత్రి ముంజపర మహేంద్రభాయ్ పేర్కొన్నారు.
కాగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలువురు ప్రముఖ యోగా గురువులు, ఔత్సాహికులు సూర్య నమస్కార్ కార్యక్రమంలో పాల్గొన్నారు. యోగా గురువు బాబా రామ్దేవ్, శ్రీ శ్రీ రవిశంకర్, సద్గురు జగ్గీ వాసుదేవ్ వంటి వారు కూడా ఇందులో ఉన్నారు. సూర్య నమస్కారాల విశిష్ఠతను వారు వివరించారు.
2021 మిస్ వరల్డ్ జపాన్ తమకి హోషి కూడా ఈ కార్యక్రమంలో వర్చువల్గా పాల్గొన్నారు. భారత ప్రభుత్వం చొరవ అందరికీ ప్రయోజనకరమని అన్నారు. చాలా మంది జపాన్ ప్రజలు యోగాను తమ దినచర్యలో భాగంగా చేసుకున్నారని తెలిపారు.
ఇటలీ యోగా ఇన్స్టిట్యూట్ ప్రెసిడెంట్ డాక్టర్ ఆంటోనియెట్ రోస్సీ, అమెరికన్ యోగా అకాడమీ ప్రెసిడెంట్ డాక్టర్ ఇంద్రనీల్ బసు రాయ్, సింగపూర్ యోగా సభ్యులు కూడా కోవిడ్ ప్రోటోకాల్ను అనుసరిస్తూ సూర్య నమస్కారాలు చేశారు.