న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి తర్వాత మరో వైరస్ ప్రపంచాన్ని అల్లాడిస్తున్నది. అదే మంకీపాక్స్ వైరస్. ప్రస్తుతం వైరస్ రోజు రోజుకు విస్తరిస్తున్నది. ఈ క్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. వైరస్ కేవలం పది రోజుల్లోనే 12 దేశాలకు విస్తరించిందని, 92 కేసులు నమోదయ్యాయని పేర్కొంది. కేసులు మరింత వేగంగా పెరిగే అవకాశం ఉందని, జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. మంకీపాక్స్ను అరికట్టేందుకు చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. మంకీపాక్స్ ఒక వైరల్ వ్యాధి. ఇది స్మాల్ పాక్స్ కుటుంబానికి చెందింది. మనదేశంలో తట్టు లాగే కనిపిస్తుంది. ఈ వైరస్ను మొదట 1958లో మొదటిసారి కోతుల్లో గుర్తించారు. దీంతో దీనికి మంకీ పాక్స్ అనే పేరు వచ్చింది. ఆ తర్వాత మనుషులకు సోకింది. 1970ల్లో తొలిసారి మనుషుల్లో గుర్తించారు. జంతువుల నుంచి మనుషులకు సోకుతుంది. అందులోనూ ఎక్కువగా ఎలుకలు, చుంచులు, ఉడతల నుంచి వ్యాపిస్తుంది. ఈ మంకీపాక్స్ వ్యాధి సాధారణంగా మధ్య, పశ్చిమ ఆఫ్రికాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఇది ఒకరి నుంచి మరొకరికి వేగంగా సోకుతుంది. మంకీపాక్స్ ఇన్ఫెక్షన్ సాధారణంగా 6 నుంచి 13 రోజులు ఉంటుంది. అయితే, కొంతమందిలో ఐదు రోజుల నుంచి 21 రోజుల వరకు ఉంటుంది.
వైరస్ సోకిన వ్యక్తికి జ్వరం, తీవ్రమైన తలనొప్పి, వెన్ను, కండరాల నొప్పులు ఉంటాయి. రోగి ముఖం, చేతులు, కాళ్లపై పెద్ద పరిమాణంలో దద్దుర్లు ఉంటాయని, కొన్ని తీవ్రమైన కేసుల్లో దద్దుర్లు కంటి కార్నియాను సైతం ప్రభావితం చేస్తాయి. కొందరిలో లక్షణాలు కనిపించవు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మంకీపాక్స్ కారణంగా మరణాలు సైతం సంభవిస్తాయి. ముఖ్యంగా చిన్నపిల్లలకు ప్రమాదం ఎక్కువ. గాలి తుంపర్ల ద్వారా, వ్యాధి సోకిన వ్యక్తికి అతి దగ్గరం ఉండడంతో ఇతరులకు వ్యాపించే అవకాశముందని నిపుణులు పేర్కొంటున్నారు. వ్యక్తిగత శుభ్రత పాటిచాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచిస్తున్నారు.