లక్నో: కేంద్ర ప్రభుత్వం గత ఏడాది తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించిన ప్రధాని మోదీ, దీనిపై రైతులకు క్షమాపణలు కూడా చెప్పారు. అయితే కేంద్ర మంత్రి వీకే సింగ్ మాత్రం వ్యవసాయ చట్టాల రద్దుపై ఏకంగా రైతులనే తప్పుపట్టారు. ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్ ఎంపీ, జూనియర్ ఏవియేషన్ మంత్రి అయిన ఆయన రైతు సంఘాలపై శనివారం మండిపడ్డారు.
కొన్నిసార్లు మనం విషయాలు బాగా అర్థం చేసుకున్నప్పటికీ అవతలి వ్యక్తిని గుడ్డిగా అనుసరిస్తామని వీకే సింగ్ విమర్శించారు. ‘కాలా కానూన్’ అని పిలిచే ఈ చట్టాలలో ‘కాలా’ లేదా నలుపు ఏమిటని ఒక రైతు నాయకుడిని తాను అడిగినట్లు తెలిపారు. సిరా తప్ప ఈ చట్టాలలో ఏమి నలుపు ఉందని ప్రశ్నించినట్లు చెప్పారు.
కాగా, ఆ రైతు నేత తన మాటను ఒప్పుకున్నప్పటికీ ఇంకా నల్ల చట్టాలుగానే పేర్కొన్నారని వీకే సింగ్ విమర్శించారు. దీనికి మందు లేదని, రైతు సంఘాల మధ్య ఆధిపత్య పోరే కారణమని ఆయన ఆరోపించారు. ఎందుకోగానీ చిన్న రైతు ప్రయోజనాల గురించి రైతు సంఘాలు ఆలోచించడం లేదని మండిపడ్డారు. అందుకే ప్రధాని మోదీ వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాల్సి వచ్చిందన్నారు.