లక్నో: దేశంలో కరోనా సెకండ్ వేవ్ కల్లోలం నేపథ్యంలో హృదయవిదారక సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. చికిత్స అందక భర్త చేతుల్లోనే భార్య మరణించింది. ఉత్తరప్రదేశ్లోని అంబేద్కర్ నగర్ జిల్లా ఆసుపత్రిలో ఈ ఘటన జరిగింది. ఒక వ్యక్తి అనారోగ్యంతో ఉన్న తన భార్యను ఆసుపత్రికి తీసుకువచ్చాడు. ఎంట్రన్స్ వద్ద ఉండి భార్యకు వైద్య చికిత్స కోసం అభ్యర్థించాడు. డాక్టర్ సాబ్.. డాక్టర్ సాబ్.. అంటూ పలుమార్లు మొరపెట్టుకున్నాడు. అయినా అతడి గోడును ఎవరూ వినిపించుకోలేదు.
మరోవైపు ఈ విషయాన్ని మీడియా కవర్ చేస్తున్నట్లు తెలుసుకున్న వైద్య సిబ్బంది గంట తర్వాత ఆ మహిళ వద్దకు వచ్చారు. ఆమెను పరీక్షించి అప్పటికే మరణించినట్లు వెల్లడించారు. భర్త చేతుల్లోనే చనిపోయిన ఆమెకు కరోనా సోకిందా లేదా అన్నది తెలియలేదు.