లక్నో: ప్రియురాలిని హత్య చేసిన యువకుడు పోలీస్ ఎన్కౌంటర్లో గాయపడ్డాడు. అతడ్ని అదుపులోకి తీసుకుని చికిత్స అందిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఈ సంఘటన జరిగింది. 17 ఏళ్ల నిధి గుప్తా, మహ్మద్ సూఫియాన్ ఏడాదిగా ప్రేమించుకుంటున్నారు. ఆమెకు మొబైల్ ఫోన్ను బహుమతిగా ఇచ్చాడు. వారిద్దరి మధ్య సంబంధం గురించి తెలియడంతో నిధి కుటుంబం మంగళవారం సూఫియాన్ ఇంటికి వెళ్లింది. ఈ సందర్భంగా ఇరు కుటుంబాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో అపార్ట్మెంట్ బిల్డింగ్ నాలుగో అంతస్తులో ఆ బాలిక పరుగులు తీసింది. సూఫియాన్ కూడా ఆమె వెంటపడ్డాడు.
కాగా, నిధి గుప్తా ఆ బిల్డింగ్పై నుంచి కిందపడి తీవ్రంగా గాయపడింది. ఆమెను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించింది. ఈ విషయం తెలిసి సూఫియాన్ పరారయ్యాడు. అయితే తమ కుమార్తెను బిల్డింగ్ పైనుంచి తోసి హత్య చేశాడని నిధి కుటుంబం ఆరోపించింది. జిహాదీ లవ్ పేరుతో ఆమెను ట్రాప్ చేసిన సూఫియాన్, మతం మారాలని చాలా కాలంగా వేధిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మరోవైపు పరారైన సూఫియాన్ కోసం తొమ్మిది పోలీస్ బృందాలను ఏర్పాటు చేశారు. అతడి సమాచారం తెలిపిన వారికి రూ.25,000 నగదు బహుమతిని కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం సూఫియాన్ను అరెస్ట్ చేసే ప్రయత్నంలో పోలీసులు అతడి కాళ్లపై కాల్పులు జరిపారు. గాయపడిన అతడికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. హత్య, మత మార్పిడి వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.