భోపాల్: బంధువైన వ్యక్తిని కొందరు మద్యం మత్తులో కారు నుంచి బయటకు తోసేశారు. సుమారు 25 కిలోమీటర్లు రోడ్డుపై ఈడ్చుకెళ్లడంతో అతడు మరణించాడు. (Man Dragged To Death) మధ్యప్రదేశ్లోని సీహోర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. భోపాల్లోని అవధ్పురి ప్రాంతానికి చెందిన 33 ఏళ్ల సందీప్ నక్వాల్, బంధువులైన సంజీవ్ నక్వాల్, రాజేష్ చాదర్తో కలిసి కారులో ప్రయాణించాడు. ఆ ముగ్గురు రాజస్థాన్లో జరిగిన ఫ్యామిలీ ఫంక్షన్కు హాజరై తిరుగు ప్రయాణమయ్యారు. ఆదివారం తెల్లవారుజామున సీహోర్ వద్ద కారు ఆపి ఫుడ్, మద్యం కొనుగోలు చేశారు. అనంతరం కారు వెనుక సీటులో కూర్చొన్న సందీప్, సంజీవ్ మధ్య ఒక అంశంపై వాగ్వాదం జరిగింది. దీంతో సంజీవ్ ఆగ్రహంతో సందీప్ను కారు నుంచి బయటకు తోశాడు.
కాగా, సేఫ్టీ బెల్ట్ పెట్టుకున్న సందీప్ పూర్తిగా రోడ్డుపై పడలేదు. కారు నుంచి వేలాడిన అతడ్ని 25 కిలోమీటర్ల దూరం వరకు ఆ వాహనంతో ఈడ్చుకెళ్లారు. ఇతర వాహనదారులు గమనించి కారు ఆపాలని డ్రైవర్కు సిగ్నల్ ఇచ్చారు. అయినా కారును డ్రైవర్ ఆపకపోవడంతో మరికొందరు తమ వాహనాల్లో దానిని అనుసరించారు. అలాగే పోలీసులకు సమాచారం ఇచ్చారు.
మరోవైపు ఈ విషయం తెలిసిన వెంటనే పోలీసులు స్పందించారు. టోల్ ప్లాజా వద్ద ఆగిన కారును అడ్డుకున్నారు. కారులో ఉన్న ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. కారు నుంచి ఈడ్చడంతో తీవ్రంగా గాయపడిన సందీప్ మరణించినట్లు తెలుసుకున్నారు. దీనికి ముందు సందీప్ భార్య ఫోన్ చేయడంతో కారులో జరిగిన సంభాషణ ఆమె విన్నది. ఈ నేపథ్యంలో పోలీసులకు ఆమె ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.