న్యూఢిల్లీ: అంధురాలైన తన తల్లిని విమానంలో వదిలేశారని (Left Blind Mother In Fligh) ఒక వ్యక్తి ఆరోపించాడు. విస్తారా ఎయిర్లైన్స్ తీరుపై మండిపడ్డాడు. ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు. నెటిజన్లు కూడా తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. దీనిపై స్పందించిన ఆ సంస్థ క్షమాపణలు చెప్పింది. ఆ వ్యక్తి నుంచి వివరాలు కోరింది. అంధురాలైన తన తల్లి ఆగస్ట్ 31న ఢిల్లీ నుంచి కోల్కతాకు విస్తారా విమానంలో ఒంటరిగా ప్రయాణించినట్లు ఆయుష్ కేజ్రీవాల్ తెలిపాడు. అంధురాలు కావడంతో ప్రయాణంలో ఆమెకు సహకరించే విధానాన్ని టికెట్ బుకింగ్ సందర్భంగా ఎంచుకున్నట్లు చెప్పాడు.
కాగా, విమానం కోల్కతా చేరిన తర్వాత తన తల్లిని వేచి ఉండమని సిబ్బంది చెప్పారని, అయితే ప్రయాణికులంతా దిగిపోగా విమానంలో ఒంటరిగా ఆమె ఉండిపోయిందని ఆయుష్ కేజ్రీవాల్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఎవరూ కూడా తన తల్లిని పట్టించుకోలేదని, ఆమెను విమానంలోనే వదిలేశారని ఆరోపించాడు. చివరకు క్లీనింగ్ సిబ్బంది గమనించి విమాన సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో అప్పుడు తన తల్లిని విమానం నుంచి కిందకు దించారని తెలిపాడు. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్లో తన గోడును వెళ్లబోసుకున్నాడు.
మరోవైపు, ఆయుష్ కేజ్రీవాల్ వీడియో పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో విస్తారా ఎయిర్లైన్స్ స్పందించింది. జరిగిన దానికి క్షమాపణలు చెప్పింది. టికెట్ బుకింగ్ వివరాలు ఇవ్వాలని అతడిని కోరింది. నెటిజన్లు కూడా ఆయుష్ పోస్ట్పై స్పందించారు. విస్తారా ఎయిర్లైన్స్ సేవల తీరుపై మండిపడ్డారు. గతంలో తాము ఎదుర్కొన్న ఇబ్బందులను కొందరు గుర్తు చేశారు. బుకింగ్ రీషెడ్యూల్ చేయాలని కోరగా అంత్యక్రియల రిసిప్ట్ అడిగినట్లు ఒక వ్యక్తి గతంలో ట్వీట్ చేశాడు.