TMC | దేశమంతా ప్రస్తుతం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల గురించే చర్చిస్తోంది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో ఏ పార్టీ అధికారంలోకి రానుందో తేలిపోయింది. ఇంకా కొన్ని నియోజకవర్గాల ఫలితాలు వెలువడాల్సి ఉంది. ఉత్తరప్రదేశ్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. పంజాబ్లో ఆప్ క్లీన్ స్వీప్ చేసింది. మరోవైపు గోవాలో కూడా బీజేపీ లీడ్లో ఉంది. అయితే.. పశ్చిమ బెంగాల్కు చెందిన తృణముల్ కాంగ్రెస్ పార్టీ.. గోవాలో కూడా కంటెస్ట్ చేసింది. పశ్చిమ బెంగాల్లో ప్రస్తుతం టీఎంసీ పార్టీనే అధికారంలో ఉండటంతో.. టీఎంసీ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ.. గోవాలో కూడా తన లక్ను ఈసారి పరీక్షించుకోవాలనుకున్నారు.
అందుకే.. గోవాలో 26 సీట్లలో ఎంజీపీ పార్టీతో కలిసి టీఎంసీ పోటీ చేసింది. కానీ.. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో టీఎంసీ రెండో, మూడో స్థానానికి మాత్రమే సరిపెట్టుకుంది. ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా ప్రకారం.. టీఎంసీ ఇప్పటి వరకు 5.22 శాతం ఓట్లనే సాధించింది. ఇక.. టీఎంసీతో పొత్తు పెట్టుకున్న మహారాష్ట్రవాడీ గోమంతక్ పార్టీ(ఎంజీపీ)కి 7.65 శాతం ఓట్లు వచ్చాయి.
గోవాలో టీఎంసీ ముఖ్య నేతలు గోవా పార్టీ చీఫ్ కిరణ్ కండోల్కర్, ఆయన భార్య కవిత, పార్టీ నామినీ చర్చిల్, ఆయన కూతురు వలంక.. అందరూ తమ నియోజకవర్గాల్లో వెనుకంజలో ఉన్నారు.
గోవా ప్రజల మనసు గెలుచుకోవడానికి మేము ఇంకా కష్టపడాలి అని తెలిసింది. ఎంత సమయం పట్టినా మేము ఇక్కడే ఉంటాం.. ఎన్నేళ్లు అయినా సరే.. గోవా ప్రజలకు సేవ చేయడంలో ఎప్పుడూ ముందుంటాం.. అని టీఎంసీ గోవా కార్యాలయం ప్రకటించింది.