న్యూఢిల్లీ: దీవెనులు ఇస్తానని చెప్పి ఓ భారతీయ పూజారి తనను వేధించినట్లు మలేషియాకు చెందిన మోడల్(Malaysian Model) లిషాలిని కనరన్ ఆరోపించారు. 2021లో మిస్ గ్రాండ్ మలేషియా అవార్డును ఆమె గెలుచుకున్నది. మలేషియాలోని సిపాంగ్లో ఉన్న మరియమ్మన్ ఆలయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు స్థానిక మీడియా తెలిపింది. అయితే తనకు జరిగిన వేధింపుల గురించి మోడల్ లిషాలినీ తన ఇన్స్టాగ్రామ్లోనూ ఓ పోస్టు పెట్టింది. తనకు జరిగిన అన్యాయాన్ని ఆమె తన పదాల్లో వివరించింది. భారతీయ పూజారి తనను అసభ్యకరంగా ముట్టుకున్నట్లు ఆ పోస్టులో రాసిందామె. పవిత్ర జలాలను చల్లుతానని చెప్పి అనుచిత రీతిలో ఆ పూజారి వ్యవహరించినట్లు ఆరోపించింది.
ఆస్థాన పూజారి లేకపోవడం వల్ల అతని స్థానంలో ఓ పూజారి తాత్కాలికంగా విధులు నిర్వర్తించాడు. ఆ పూజారి మోడల్తో అనైతికంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. బాధితురాలి ముఖంపై పవిత్ర జలాన్ని చల్లి, ఆ తర్వాత మహిళలను వేధించేవారని సిపాంగ్ ఏసీపీ నొరిజామ్ బహమన్ తెలిపారు. ఈ విషయాన్ని బహిర్గతం చేయవద్దు అని ఓ ఆఫీసర్ చెప్పినా.. ఆ మోడల్ మాత్రం తన సోషల్ మీడియా ద్వారా విషయాన్నిచెప్పింది. జూన్ 21వ తేదీన ఒంటరిగా గుడికి వెళ్లానని, ఆ సమయంలో పూజారి తన వద్దకు వచ్చి కాసేపు ఆగమన్నాడని, ప్రార్థనలు ముగిసిన తర్వాత కలుస్తానన్నాడని ఆమె పేర్కొన్నది.
గంట సేపు వేచిన తర్వాత ఆ పూజారి వచ్చాడని, ప్రైవేటు ఆఫీసుకు తీసుకెళ్లి తనను వేధించాడని ఆమె చెప్పింది. తొలుత ఓ బలమైన ద్రవాన్ని తనపై చల్లాడని, ఆ తర్వాత తన ఛాతిని నిమిరినట్లు ఆమె తన పోస్టులో పేర్కొన్నది. తన ముందు నిలుచున్న పూజారి .. చేతులను బ్లౌజ్లో పెట్టి అసభ్యకరంగా టచ్ చేసినట్లు ఆమె ఆరోపించింది. ఆ సమయంలో తన బ్రెయిన్ పనిచేయలేదని, మాటలు రాలేదని, నిశ్చేష్టురాలైనట్లు ఆమె తెలిపింది. గుడిలో పూజారి వేధించడాన్ని తట్టుకోలేకపోయానని, అందుకే ఈ విషయాన్ని బహిరంగంగా చెబుతున్నట్లు ఆమె పేర్కొన్నది. జూలై 4వ తేదీన ఆ పూజారిపై ఆమె పోలీసు కేసు నమోదు చేసింది. ప్రస్తుతం ఆ పూజారి పరారీలో ఉన్నాడు. అతని కోసం గాలిస్తున్నారు. దర్యాప్తు కొనసాగుతోంది.