తిరువనంతపురం: కేరళకు చెందిన ఆ అందాల రాశి నటిగా రాణిస్తోంది. చెంబట్టు అనే మలయాళం టీవీ షో ద్వారా ఆమె పాపులారిటీ అమాంతం పెరిగిపోయింది. అగ్ర నటి కావాలని ఆశిస్తున్న ఆమె వయస్సు ప్రస్తుతం 23 ఏళ్లు. కానీ, తల్లి కావాల్సిన ఈ వయసులో ఆమె అనుకోకుండా అక్క అయ్యింది. ఎందుకంటే ఆమె తల్లి 47 ఏళ్ల వయస్సులో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఆ యువ నటి తన ఇన్స్టా హ్యాండిల్ ద్వారా నెటిజన్లతో పంచుకుంది.
ఇంతకూ ఆ నటి ఎవరనేగా మీ సందేహం..? ఆమెనే మలయాళ సినీ పరిశ్రమలో అంచెలంచెలుగా ఎదుగుతున్న యువ నటి ఆర్య పార్వతి. చెంబట్టు అనే టీవీ షో ఆమెకు విపరీతమైన క్రేజ్ను తీసుకొచ్చింది. అయితే, తన తల్లి మళ్లీ తల్లి కాబోతున్నట్లు ఆర్య పార్వతికి ఆఖరి వరకు తెలియదట. తల్లి 8 నెలల గర్భవతిగా ఉన్నప్పుడు ఆమె తండ్రి ఫోన్ చేసి బిడ్డకు విషయం చెప్పాడట. విషయం తెలిస్తే పరువు పోయినట్లుగా ఫీలయితావేమోనన్న భయంతోనే ఇన్నాళ్లు చెప్పలేదని అన్నాడట. ఈ విషయాలను ఆర్య పార్వతి ఇన్స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది.
ఇటీవల ‘హ్యూమన్స్ ఆఫ్ బాంబే’ అనే మ్యాగజీన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఆర్య పార్వతి ఈ వివరాలను వెల్లడించారు. ‘ఒక ఫోన్ కాల్ నా జీవితాన్ని మార్చేసింది. గత ఏడాది వెకేషన్ కోసం ఇంటికి వెళ్లడానికి కొన్ని రోజుల ముందు నా తండ్రి నుంచి నాకు ఫోన్ వచ్చింది. ఫోన్ లిఫ్ట్ చేసిన తర్వాత కాసేపటి వరకు ఆయన ఏమీ మాట్లాడలేకపోయారు. కొన్ని నిమిషాల తర్వాత ‘అమ్మ గర్భవతి’ అని చెప్పాడు. దాంతో ఏం చెప్పాలో నాకు అర్థం కాలేదు. అమ్మ వయస్సు 47 ఏళ్లు. నేను ఆలోచిస్తుండగానే.. అమ్మకు ఇప్పుడు ఎనిమిదో నెల అని నా తండ్రి చెప్పాడు. అమ్మకు కూడా తనకు ఏడో నెల వచ్చేదాక గర్భవతినని గుర్తించలేకపోయిందట’ అని ఆర్య పార్వతి ఇంటర్వ్యూలో వివరించింది.
“ఈ విషయం చెప్పిన తర్వాత నా తండ్రి నాతో ‘నీకు తెలిస్తే ఎలా స్పందిస్తావోనన్న భయంతో ఇన్ని రోజులు దాచాం’ అన్నాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు నేను ఇంటికి వెళ్లాను. ఇంట్లోకి వెళ్లగానే అమ్మ ఒడిలో పడుకుని ఏడవడం మొదలుపెట్టాను. ‘విషయం చెబితే నేను ఎందుకు పరువుపోయినట్టుగా ఫీలవుతా..?’ అని ఏడుస్తూనే నా పేరెంట్స్ను అడిగాను.” అని ఆర్య పార్వతి చెప్పుకొచ్చింది. “ఈ విషయాన్ని తాము మెల్లగా మా బంధువులకు, మిత్రులకు చెప్పడం మొదలుపెట్టాం. కొందరు బాగానే స్పందించారు. కొందరు మాత్రం ఎగతాళిగా మాట్లాడారు. కానీ మేం అవేవీ పట్టించుకోలేదు. చివరికి అమ్మకు సుఖ ప్రసవం జరిగింది. నన్ను అక్కా అని పిలిచేందుకు ఒక చెల్లి వచ్చింది” అని ఆమె సంతోషం వ్యక్తం చేసింది.
ఇదే విషయాన్ని ఆర్య పార్వతి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో విశేష స్పందన లభిస్తోంది. నెటిజన్లు ఆర్య పార్వతికి, ఆమె కుటుంబానికి మద్దతుగా కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. చాలామంది ఆమెకు అభినందనలు తెలియజేస్తున్నారు.