ముంబై: మహారాష్ట్ర ప్రభుత్వాన్ని పాకిస్థాన్లోని దావూద్ ఇబ్రహీం నడుపుతున్నాడని బీజేపీ ఎంపీ మనోజ్ కోటక్ ఆరోపించారు. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కూటమితో ఏర్పడిన మహా అగాడి ప్రభుత్వం ‘మహామాఫియా అగాడి ప్రభుత్వం’ అని ఎద్దేవా చేశారు. ఈ ప్రభుత్వానికి దావూద్ ఇబ్రహీం మద్దతు ఉందని మహారాష్ట్ర బీజేపీ ఎంపీ అయిన ఆయన విమర్శించారు. పాకిస్థాన్లో కూర్చున్న దావూద్, మహారాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతున్నాడని, అతడికి అనుకూలంగా ప్రభుత్వం నడుస్తోందని మనోజ్ కోటక్ ఆరోపించారు.
కాగా, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం మనీలాండరింగ్ వ్యవహారాలకు సంబంధించిన కేసులో మహారాష్ట్ర మంత్రి, ఎన్సీపీ సీనియర్నేత నవాబ్ మాలిక్ను ఫిబ్రవరి 23న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేసింది. ఈ నేపథ్యంలో సీఎం ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని దావూద్ నడిపిస్తున్నాడని బీజేపీ ఆరోపిస్తున్నది. అలాగే అరెస్ట్ అయిన నవాబ్ మాలిక్ తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నది. మరోవైపు ఈడీ ప్రత్యేక కోర్టు మంత్రి నవాబ్ మాలిక్కు ఈ నెల 21 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది.