భోపాల్: ఒక వ్యక్తి తన భార్యను అనుమానించడంతో వారిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె తన పుట్టింటికి చేరుకున్నది. అయితే మద్యం సేవించిన ఆ వ్యక్తి నిద్రిస్తున్న మామను గొడ్డలితో నరికి హత్య చేశాడు. కాపాడేందుకు ప్రయత్నించిన అతడి మరో కుమార్తెపై కూడా గొడ్డలితో దాడి చేసి పారిపోయాడు. (Man Kills Father-In-Law) మధ్యప్రదేశ్లోని దామోహ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బమోరి గ్రామానికి చెందిన రామ్ప్రసాద్ రైక్వార్ తన భార్య రష్మిపై అనుమానం పెంచుకోవడంతో వారిద్దరి మధ్య తరచుగా గొడవలు జరుగుతున్నాయి.
కాగా, ఆ దంపతులు కొన్ని నెలల కిందట పని కోసం ముంబై వెళ్లారు. అక్కడ కూడా భార్య ప్రవర్తనపై రామ్ ప్రసాద్ అనుమానం పెంచుకున్నాడు. ఈ వివాదం ముదరడంతో బమోరి గ్రామంలోని అత్తగారింటికి రష్మి చేరుకున్నది. అక్కడ కూడా వివాదం పరిష్కారం కాకపోవడంతో తన కుటుంబ సభ్యుల సలహా మేరకు మూడు రోజుల క్రితం పిప్రౌధాలోని తన పుట్టింటికి తిరిగి వచ్చింది.
మరోవైపు భర్త రామ్ప్రసాద్ కూడా తన భార్యతో పాటు అత్తవారింటికి చేరుకున్నాడు. ఆదివారం మద్యం మత్తులో ఉన్న అతడు అత్తమామలతో గొడవపడి ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. రోజంతా బయటే గడిపి సోమవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఇంటికి తిరిగి వచ్చాడు. నిద్రిస్తున్న 63 ఏళ్ల మామ రమేష్ రైక్వార్పై గొడ్డలితో దాడి చేసి హత్య చేశాడు. అరుపువుల విని నిద్రలేచిన రమేష్ పెద్ద కుమార్తె అడ్డుకోవడానికి ప్రయత్నించగా, రామ్ప్రసాద్ ఆమెపై కూడా గొడ్డలితో దాడి చేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు.
మరోవైపు ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ ఇంటికి చేరుకున్నారు. హత్యకుగురైన రమేష్ మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన మహిళను చికిత్స కోసం బటియాగఢ్ ఆరోగ్య కేంద్రంలో చేర్పించారు. పరారీలో ఉన్న నిందితుడు రామ్ప్రసాద్ కోసం వెతుకుతున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.