న్యూఢిల్లీ: చిన్నపిల్లలు ఎంతో ఇష్టంగా తినే కిట్క్యాట్ చాక్లెట్ రేపర్పై జగన్నాథ స్వామి చిత్రాన్ని ముద్రించారు. దీనిపై జనం ఆగ్రహం వ్యక్తం చేశారు. నెస్లే ఇండియా సంస్థపై నెటిజన్లు ఆన్లైన్లో మండిపడ్డారు. పిల్లలు కిట్క్యాట్ను తిన్న తర్వాత ఆ రేపర్ రోడ్లపై, డ్రైన్లలో, డస్ట్బిన్లలో చేరుతుందని తెలిపారు. దీంతో జగన్నాథ్, బలభద్ర, సుభద్ర దేవతలను అవమానించినట్లు, అగౌరపరిచినట్లు అవుతుందన్నారు. ఈ నేపథ్యంలో ఆ చాక్లెట్ కవర్ పైనుంచి ఆ దేవుళ్ల ఫొటోలను తొలగించాలని డిమాండ్ చేశారు.
కాగా, మల్టీ నేషనల్ కంపెనీలన్నీ హిందూమతం పట్ల మజాక్ చేస్తున్నాయని ఒకరు విమర్మించారు. ఇతర మతాలకు సంబంధించి ఇలా చేస్తే ఏమవుతుందో అన్నది వారికి తెలుస్తుందని దుయ్యబట్టారు. మరోవైపు విమర్శల నేపథ్యంలో నెస్లే ఇండియా సంస్థ వెనక్కి తగ్గింది. వీటి ప్యాక్లను గత ఏడాది మార్కెట్ నుంచి వెనక్కి తీసుకున్నట్లు తెలిపింది.
మత నమ్మకాలు, సెంటిమెట్లను అవమానించడం తమ ఉద్దేశం కాదని నెస్లే ఇండియా పేర్కొంది. గత సంవత్సరం ఒడిశా సంస్కృతిని సూచించే ప్యాక్లను డిజైన్ చేసినట్లు తెలిపింది. ప్రత్యేకంగా గుర్తించదగిన కళారూపాలను అందరికీ పరిచయం చేయడమే తమ ఉద్దేశమని వివరించింది.
అయితే ప్రజల సున్నితత్వాన్ని, నమ్మకాలను అర్థం చేసుకున్నామని నెస్లే ఇండియా తెలిపింది. అనుకోకుండా ఎవరి మనోభావాలను దెబ్బతీసి ఉంటే చింతిస్తున్నామని పేర్కొంది. తక్షణ చర్యతో ఇప్పటికే మార్కెట్ నుండి ఈ ప్యాక్ల ఉపసంహరణను ప్రారంభించినట్లు వెల్లడించింది.