బెంగళూరు: విమానంపై మాయమైన హనుమంతుడి చిత్రం మళ్లీ ప్రత్యక్షమైంది. ఏరో షో చివరి రోజున ఆ విమానంపై తిరిగి కనిపించింది. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది. ఆసియాలోనే అతి పెద్ద ఏరో ఇండియా 2023 ప్రదర్శనను ఈ నెల 13న ప్రధాని మోదీ ప్రారంభించారు. ఐదు రోజులపాటు జరిగిన ఏరో షోలో 98 దేశాలకు చెందిన 809 కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. అయితే ఏరో షో తొలి రోజున హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) తయారు చేసిన ప్రోటోటైప్ ఎయిర్క్రాఫ్ట్ తోక భాగంలో హనుమాన్ స్టిక్కర్ కనిపించింది. ‘తుఫాన్ వస్తోంది’ అని దాని కింద క్యాప్షన్ ఇచ్చారు.
కాగా, విమానంపై ఆంజనేయుడి చిత్రం ఉండటంపై విమర్శలు వచ్చాయి. ఆ విమానం అంత శక్తిమంతమైనదిగా పేర్కొనే ఉద్దేశంతోనే హనుమాన్ స్టిక్కర్ ఉంచినట్లు హాల్ అధికారులు వివరణ ఇచ్చారు. ఆ మరునాడు దానిని తొలగించారు. అయితే ఏరో షో చివరి రోజున హనమంతుడి చిత్రం తిరిగి ఆ విమానంపై కనిపించింది. దీని గురించి హాల్ అధికారులు ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నారు.
మరోవైపు ఐదు రోజుల పాటు జరిగిన ఏరో ఇండియా ప్రదర్శనలో పలు విమానాలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఎయిర్బస్, బోయింగ్, డస్సాల్ట్ ఏవియేషన్, లాక్హీడ్ మార్టిన్, ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీ, బ్రహ్మోస్ ఏరోస్పేస్, ఆర్మీ ఏవియేషన్, హెచ్సీ రోబోటిక్స్, రోల్స్ రాయిస్ వంటి ప్రముఖ సంస్థలు పాల్గొన్నాయి. అమెరికాకు చెందిన ఎఫ్-35 ఫైటర్ జెట్లు, బాంబర్ విమానాలు కూడా విన్యాసాలు నిర్వహించాయి.