న్యూఢిల్లీ, జూలై 15: భారతీయ శిక్షాస్మృతి(ఐపీసీ)లోని సెక్షన్ 124ఏ(రాజద్రోహం) దుర్వినియోగంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. వలస కాలపు చట్టం స్వతంత్ర భారతదేశంలో ఇంకా అవసరమా అని కేంద్రాన్ని ప్రశ్నించింది. భారత స్వాతంత్య్ర ఉద్యమాన్ని అణచివేయడానికి, మహాత్మా గాంధీ, తిలక్, గోఖలే లాంటి నాయకుల గొంతు నొక్కడానికి బ్రిటిష్ పాలకులు ఈ చట్టాన్ని ఉపయోగించారని గుర్తు చేసింది. కాలం తీరిన ఎన్నో చట్టాలను రద్దు చేస్తూ వస్తున్న ప్రస్తుత ప్రభుత్వం ఇంకా రాజద్రోహం సెక్షన్ను కొనసాగించడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఈ సెక్షన్ను ఎందుకు కొట్టివేయకూడదని ప్రశ్నించింది. ఐపీసీ 124ఏ సెక్షన్ రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా, విశ్రాంత సైనికాధికారి మేజర్ జనరల్(రిటైర్డ్) ఎస్జీ వోంబత్కేరే దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. 124ఏ సెక్షన్ రాజ్యాంగబద్ధతను పరిశీలిస్తామని తెలిపింది. ఈ మేరకు కేంద్రప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. ‘చట్టాల దుర్వినియోగంపైనే మా ఆందోళన అంతా’ అని పేర్కొన్నది. ఈ సెక్షన్ రాజ్యాంగబద్ధతపై కేంద్రమాజీ మంత్రి అరుణ్ శౌరీ కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ సెక్షన్పై అన్ని పిటిషన్లను కలుపుకొని విచారణ జరుపుతామని కోర్టు తెలిపింది.
కక్షసాధింపునకు వాడుతున్నారు..
‘రాజద్రోహం కింద పెడుతున్న కేసులు ఎన్ని? నిలబడుతున్నవి ఎన్ని? సెక్షన్ దుర్వినియోగం గురించి ఎందుకు ఆలోచించడం లేదు. ఈ సెక్షన్ను కక్ష సాధింపు చర్యలకు వాడుతున్నారు. అవతలి పక్షం మాట వినకపోతే ఈ సెక్షన్ ప్రయోగిస్తున్నారు. వ్యక్తిని నిర్బంధంలోకి తీసుకోవాలంటే పోలీసులు రాజద్రోహం కేసులు పెడుతున్నారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు గడిచింది. ఈ సెక్షన్ అవసరం ఇంకా ఉందని మీరు భావిస్తున్నారా’ అని జస్టిస్ రమణ అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ను ప్రశ్నించారు. ఇది వ్యక్తులకు, సంస్థల మనుగడకు ప్రమాదకరంగా మారిందన్నారు. ‘చెట్టును కొట్టడానికి వడ్రంగికి గొడ్డలి ఇస్తే.. అడవిని మొత్తం నరికినట్టు ఉంది’ అని వ్యాఖ్యానించారు. దీనిపై కేకే వేణుగోపాల్ సమాధానం ఇస్తూ.. చట్టాన్ని రద్దు చేయాల్సిన అవసరం లేదని, దుర్వినియోగం కాకుండా చర్యలు తీసుకొంటే సరిపోతుందన్నారు.
కేదార్నాథ్ తీర్పు
రాజద్రోహం సెక్షన్ రాజ్యాంగబద్ధమైనదేనని 1962లో కేదార్నాథ్ సింగ్ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. వాక్స్వేచ్ఛకు పరిమితులు విధించవచ్చని పేర్కొన్నది. అయితే వ్యక్తుల ఏ చర్యనైనా హింసకు దారి తీసినప్పుడే ఈ సెక్షన్ను ప్రయోగించాలని సూచించింది. బల్వంత్ సింగ్ కేసులో కూడా సుప్రీంకోర్టు ఇదే తరహా తీర్పునిచ్చింది. వ్యక్తి మాటలు, చర్యలు వెంటనే హింసకు కారణం అయితే రాజద్రోహం సెక్షన్ కిందకు వస్తుందని తెలిపింది. ఇదిలా ఉండగా రాజద్రోహం చట్టాన్ని మనం బ్రిటిష్ పాలకుల నుంచి గ్రహించి ఇంకా కొనసాగిస్తుండగా, బ్రిటన్లో మాత్రం 2009లోనే రద్దు చేశారు. ఈ చట్టం రద్దు కోసం బ్రిటన్ లా కమిషన్ 1977లోనే సిఫారసు చేసింది.
సెక్షన్ 124ఏ ఏం చెప్తున్నది?
మాటలతో కానీ, చేతలతో కానీ, సంకేతాలతో కానీ, ప్రదర్శనలతో కానీ, మరేవిధంగానైనా కానీ.. భారతదేశంలో చట్టబద్ధంగా ఏర్పాటైన ప్రభుత్వం పట్ల అవిధేయత, విద్వేషం, శత్రుభావనలను ప్రేరేపించిన, ప్రేరేపించడానికి ప్రయత్నించినవారెవరికైనా గరిష్ఠంగా జీవిత ఖైదు, జరిమానా విధించవచ్చు.