బెంగళూరు, సెప్టెంబర్ 18: అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నేత బీఎస్ యెడియూరప్ప, ఆయన కుటుంబసభ్యులపై లోకాయుక్త పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రత్యేక కోర్టు ఆదేశాల మేరకు శుక్రవారం ఈ కేసు నమోదైంది. ఇందులో యెడియూరప్పతోపాటు ఆయన కుమారుడు, కర్ణాటక బీజేపీ ఉపాధ్యక్షుడు విజయేంద్ర, మనువడు శశిథర్, అల్లుడు సంజయ్శ్రీ, వ్యాపారవేత్త చంద్రకాంత్ రామలింగం, ఎమ్మెల్యే, బెంగళూరు డెవలప్మెంట్ అథారిటీ మాజీ అధ్యక్షుడు సోమశంకర్, బీడీఏ మాజీ కమిషనర్ జీసీ ప్రకాశ్ను నిందితులుగా చేర్చారు. బీడీఏ కాంట్రాక్టులను మంజూరు చేసేందుకు నిందితులు ముడుపులు స్వీకరించినట్టు సామాజిక కార్యకర్త అబ్రహాం ఫిర్యాదు చేయడంతో అవినీతి నిరోధక చట్టంతోపాటు ఐపీసీలోని వేర్వేరు సెక్షన్ల కింద ఈ కేసు నమోదైంది.
దాద్రానగర్ హవేలీ బీజేపీ చీఫ్పై కేసు
దాద్రానగర్ హవేలీ డామన్ డయ్యూ బీజేపీ శాఖ అధ్యక్షుడు దీపేశ్ తండేల్తోపాటు, ఆ పార్టీ కార్యకర్త మహేశ్ తండేల్పై పోలీసులు కేసు నమోదు చేశారు. వీరు అక్రమంగా ఓ ఇంటిలోకి చొరబడి విధ్వంసం సృష్టించినట్టు కుందన్ పార్ అనే దుకాణదారుడు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.