తిరువనంతపురం : కేరళలోని కొచ్చి మహరాజా కాలేజ్ ఆవరణలో ఎస్ఎఫ్ఐ యూనిట్ కార్యదర్శిపై దుండగులు దాడికి తెగబడి కత్తిపోట్లకు గురిచేశారు. ఫ్రెటెర్నిటీ మూమెంట్, కేరళ స్టూడెంట్స్ యూనియన్ (కేఎస్యూ) కార్యకర్తలు విద్యార్ది నాసిర్ అబ్ధుల్ రెహ్మాన్పై గురువారం మధ్యాహ్నం మెరుపు దాడికి పాల్పడ్డారని ఎస్ఎఫ్ఐ ఆరోపించింది.
ఘర్షణలు వ్యాపించకుండా మహారాజా కాలేజ్ను నిరవధికంగా మూసివేస్తున్నట్టు ఘటన అనంతరం కళాశాల నిర్వాహకులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో పది మందిపై హత్యాయత్నం, సామూహిక దాడి కింద కేసు నమోదు చేశారు.
గాయపడిన విద్యార్ధి నాసిర్ను కొచ్చిలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాలేజ్ యూనియన్ ఎన్నికలకు సంబంధించి బుధవారం రాత్రి ఘర్షణ జరిగిన క్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. విద్యార్ధుల మధ్య ఘర్షణలు చెలరేగకుండా క్యాంపస్లో పెద్ద ఎత్తున పోలీస్ బలగాలను మోహరించారు.
Read More :