రాంచీ: దాణా కుంభకోణం కేసులో బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ దోషిగా తేలారు. దొరండా ట్రెజరీ నుంచి అక్రమరీతిలో నిధులు ఖాళీ చేసిన కేసులో రాంచీలోని ప్రత్యేక సీబీఐ కోర్టు ఇవాళ తీర్పును వెలువరించింది. జడ్జి సీకే శశి ఆదేశాల మేరకు లాలూ ప్రసాద్ ఇవాళ భౌతికంగా కోర్టుకు హాజరయ్యారు. ఇదే కేసులో నిందితులుగా ఉన్న మరో 98 మందిని కూడా నేరుగా హాజరుకావాలని కోర్టు ఆదేశించింది. 1996లో తొలిసారి దొరండా ట్రెజరీ కేసు నమోదు అయ్యింది. ఆ సమయంలో 170 మంది నిందితులుగా ఉన్నారు. ఈ కేసుతో లింకు ఉన్న 55 మంది ఇప్పటికే మరణించారు. దాణా కుంభకోణంలో దొరండా ట్రెజరీ కేసులో అయిదవది. మొత్తం 950 కోట్ల దాణా కుంభకోణానికి లాలూ పాల్పిడినట్లు ఆరోపణలు ఉన్నాయి. లాలూ ప్రసాద్ ప్రభుత్వం పశువుల మేత కోసం నిధులు దుర్వినియోగం చేసినట్లు కేసులు నమోదు అయ్యాయి. దాణా కుంభకోణం కేసులో 14 ఏళ్ల జైలుశిక్ష పడగా.. లాలూ ఇప్పటి వరకు 3.5 ఏళ్లు జైలు జీవితాన్ని అనుభవించారు. దొరండా ట్రెజరీ నుంచి 139.35 కోట్లను స్వాహా చేశారు. ఈ కేసులో 36 మందికి మూడేళ్ల జైలు శిక్ష పడింది. లాలూ ప్రసాద్కు ఇంకా శిక్షను ప్రకటించలేదని డిఫెన్స్ లాయర్ సంజయ్ కుమార్ తెలిపారు.