ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై ఆప్ మాజీ నేత కుమార్ విశ్వాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఏదో ఒక రోజు పంజాబ్ ముఖ్యమంత్రి అయినా, లేదంటే ఖలిస్తాన్ ప్రధాని అయినా అవుతానని సీఎం కేజ్రీవాల్ తనతో అన్నారని కుమార్ విశ్వాస్ వెల్లడించారు. పంజాబ్ అంటే సీఎం కేజ్రీవాల్కు ఏమాత్రం అర్థం కాలేదని ఎద్దేవా చేశారు. పంజాబ్ అంటే రాష్ట్రం కాదని, అదో భావన అని ఆయన పేర్కొన్నారు.
నేను మొదటి నుంచి చెబుతూనే వస్తున్నా. వేర్పాటువాదులు ఖలిస్తాన్ ఉద్యమానికి మద్దతిచ్చే వారితో కలవొద్దని నేను చెప్పాను. కాదు.. కాదు.. నేను కలుస్తానని అన్నారు. ఏమీ ఆలోచించాల్సిన పనిలేదన్నారు. అయితే వేర్పాటువాదులతో చేతులు కలపొద్దని నేను అన్నాను. ఏమవుతుంది? నేనే మొట్ట మొదటి ప్రధాని అవుతా. అని కేజ్రీవాల్ అన్నారు. అలాగే పంజాబ్ సీఎం కావడానికి కూడా ఆయన ప్రణాళికలు వేసుకున్నారు. ఇప్పటికీ ఆ ఊహల్లోనే వుంటారు అని కుమార్ విశ్వాస్ వెల్లడించారు. అధికారం కోసం కేజ్రీవాల్ ఏమైనా చేయగలరని కుమార్ విశ్వాస్ విమర్శించారు.