Ketan Agarwal : మహారాష్ట్రలోని పూనేకు చెందిన కేతన్ అగర్వాల్ హత్య కేసు విచారణలో అనేక ఆసక్తికర విషయాలు బయటపడుతున్నాయి. కేతన్ హత్యకు దారితీసిన పరిస్థితులపై ప్రధాన నిందితురాలు సియా గోయల్ భిన్నమైన సమాధానాలు ఇస్తోంది. తాజాగా పోలీసుల విచారణలో కొన్ని ఆసక్తికర విషయాల్ని తెలిపింది. కేతన్ అగర్వాల్ను పెళ్లి చేసుకోవడం తనకు ఇష్టం లేదని, ఇందుకు అతడు విగ్గు ధరించడమే కారణమని సియా తెలిపింది. కేతన్ చూడటానికి అంతగా బాగుండేవాడు కాదని, బట్టతల ఉందని, పైగా తను విగ్గు వాడటం తనకు నచ్చలేదని చెప్పింది.
అతడికి జుట్టు బాగా ఊడిపోవడం వల్ల విగ్గు పెట్టుకున్నాడని, తనకు కాబోయే వాడు ఇలా విగ్గు ధరించడం తనకు అస్సలు ఇష్టం లేదని పోలీసులకు చెప్పింది. ఇదే సమయంలో పెళ్లిని ఆపేందుకు తాను ప్రయత్నిస్తుంటే ఇప్పుడు అంత సమయం లేదని, ఇప్పటికే పెళ్లిని ఆపే విషయంలో సమయం మించిపోయిందని కేతన్ తనతో అన్నట్లు సియా తెలిపింది. పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు చాలా దూరం వెళ్లిపోయాయని, దీంతో పెళ్లి ఆపడం సాధ్యం కాదనేలా అతడు చెప్పినట్లు సియా వివరించింది. మరోవైపు కేతన్ విగ్గు అంశంపై కేతన్ తండ్రి మీడియాతో మాట్లాడాడు. తన కొడుకు విగ్గు వాడటం గురించి వారి కుటుంబానికి ముందే చెప్పామన్నాడు. అంతేకాదు.. సియాకు ఏమాత్రం అసంతృప్తి, ఇబ్బంది ఉన్నా ఈ పెళ్లి ఆపాలని తాము కూడా భావించినట్లు చెప్పారు. ఇక, ప్రస్తుతానికి సియాకు ఆమె కుటుంబ సభ్యుల నుంచి పెద్దగా సహకారం లభించడం లేదు.
ఆమె అరెస్ట్ అయిన తర్వాత నుంచి సియా కుటుంబ సభ్యులు ఎవరూ ఆమెను కలవలేదు. అయితే, సియా గోయల్ ప్రియుడు చేతన్ చౌదరి కుటుంబ సభ్యులు మాత్రం అతడిని తరచూ కలుస్తున్నారని విచారణ అధికారులు తెలిపారు. సియా తప్పు చేసి ఉంటే ఆమెను ఉరితీసినా తమకు ఏ అభ్యంతరం లేదని ఆమె తండ్రి మీడియాతో చెప్పారు. కేతన్ తండ్రి మాట్లాడుతూ.. సియా చేసిన నేరం రుజువైతే ఆమెను కూడా అలాగే, కొండపైనుంచి తోసి చంపేయాలని కోరాడు. కేతన్ హత్యపై మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడారు. ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. పిల్లల్లో ఇలాంటి నేర ప్రవృత్తి సంబంధమైన ఆలోచనలకు దూరంగా పెంచాలని ఆయన సూచించారు.