తిరువనంతపురం: నిజ జీవితంలో అసలైన హీరోలు కొందరు ఉంటారు. అలాంటి ఒక వ్యక్తి కాలిపోతున్న మినీ లారీతోపాటు దాని వల్ల వాటిల్లే ముప్పు నుంచి స్థానికులను కాపాడాడు. కేరళలోని కోడెన్చెరీలో ఈ ఘటన జరిగింది. ఆదివారం గడ్డి లోడుతో మినీ లారీ వెళ్తున్నది. అయితే హైటెన్షన్ విద్యుత్ వైర్లకు గడ్డి మోపులు తగలడంతో మంటలు రాజుకున్నాయి. లారీ అంతా మంటలు వ్యాపించడంతో అందులోని డ్రైవర్కు ఏమి చేయాలో పాలుపోలేదు. ఇక తన వాహనం పూర్తిగా కాలిపోవడం ఖాయమని భావించిన డ్రైవర్ ప్రాణ రక్షణకు బయటకు దూకేశాడు.
ఇంతలో స్థానికుడైన షాజీ వర్గీస్ అలియాస్ షాజీ పప్పన్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. వెంటనే లారీలోకి ఎక్కి దానిని ఒక ఖాళీ గ్రౌండ్లోకి తీసుకెళ్లాడు. అక్కడ మలుపులు తిప్పుతూ వంకర టింకరగా లారీని డ్రైవ్ చేశాడు. దీంతో అప్పటికే సగం కాలిన గడ్డి మోపులు వాహనం నుంచి కింద పడ్డాయి. ఇలా కొంత ప్రయత్నం తర్వాత లారీని నిలిపాడు. కొందరు స్థానికుల సహాయంతో మంటలను పూర్తిగా అదుపుచేశాడు.
మరోవైపు స్థానికులు తమ మొబైల్లో తీసిన ఈ వీడియో వైరల్ అయ్యింది. దీంతో 45 ఏండ్ల షాజీ వర్గీస్ పేరు మారుమోగిపోయింది. పలువురు ఆయనకు ఫోన్ చేసి అభినందించారు. ఆ ప్రాంతం ఫైర్ అధికారి పియస్ అగస్టిన్ నుంచి కూడా ఆయన ప్రశంసలు అందుకున్నారు. వర్గీస్ సమయానికి స్పందించకపోతే దగ్ధమవుతున్న గడ్డి లోడు లారీ వల్ల ఎలాంటి ప్రమాదం జరిగి ఉండేదో చెప్పలేమని అన్నారు.
కాగా, తాను గత 25 ఏండ్లుగా భారీ వాహనాలను నడుపుతున్నానని వర్గీస్ తెలిపాడు. ఇలాంటి ప్రమాదాలు చాలా చూసినట్లు చెప్పాడు. ఆ అనుభవంతో కాలిపోతున్న లారీని జనాల నుంచి దూరంగా తీసుకెళ్లానని అన్నాడు. ఒక వేళ ఆ లారీ అక్కడే ఉంటే మంటలకు పెట్రోల్ ట్యాంక్ పేలి పెద్ద ప్రమాదం జరిగి ఉండేదని తెలిపాడు. తనకు తోచిన విధంగా ఆ ముప్పును తప్పించినట్లు మీడియాకు వెల్లడించాడు.