న్యూఢిల్లీ: మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన బీజేపీ ఎంపీ, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ఎంత శక్తిమంతుడో ఆలోచించాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) అన్నారు. చాలా రోజులుగా ఆయనపై కేసు నమోదు కాకపోవడంతో చివరకు సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సి వచ్చిందని తెలిపారు. బ్రిజ్ భూషణ్పై చర్యలకు డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద మరోసారి నిరసన కొనసాగిస్తున్న రెజ్లర్ల వద్దకు కేజ్రీవాల్ శనివారం వెళ్లారు. వారికి తన సంఘీభావాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడారు. దేశాన్ని ప్రేమించే వారంతా పార్టీలకు అతీతంగా జంతర్మంతర్ వద్దకు వచ్చి నిరసన చేస్తున్న రెజ్లర్లకు మద్దతు తెలుపాలని కోరారు. రెజ్లర్లు కేవలం వారి కోసం పోరాడటం లేదని, మొత్తం క్రీడాకారుల కోసం పోరాడుతున్నారని అన్నారు. ‘లైంగిక వేధింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి (బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్) ఎంత శక్తిమంతుడో ఆలోచించాలి. ఆయనపై కేసు నమోదుకు సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది’ అని వ్యాఖ్యానించారు.
కాగా, మహిళలను లైంగికంగా వేధించిన వారిని ఉరి తీయాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. జంతర్మంతర్ వద్ద నిరసన చేపట్టిన అన్నా హజారే దేశ రాజకీయాలను మార్చేశారని గుర్తు చేశారు. ప్రస్తుతం రెజ్లర్లు చేస్తున్న నిరసన కూడా క్రీడల్లో మార్పు తీసుకువస్తుందని అన్నారు. దేశాన్ని ప్రేమించే వారు సెలవు తీసుకుని వారి నిరసనలో పాల్గోవాలని కేజ్రీవాల్ పిలుపునిచ్చారు.
#WATCH| Delhi: "Those who love our country, whether they're from Congress, AAP or BJP and even if not affiliated with any party, must take off and come here to extend support to them (wrestlers)…": Delhi CM Arvind Kejriwal at Jantar Mantar pic.twitter.com/MFxQEkDPsU
— ANI_HindiNews (@AHindinews) April 29, 2023