లక్నో: పోలీస్ డిపార్టుమెంటులో పనిచేస్తూ గడ్డం పెంచుకోవడం అనేది రాజ్యంగం కల్పించిన హక్కు కాదని అలహాబాద్ హైకోర్టు పరిధిలోని లక్నో బెంచ్ స్పష్టంచేసింది. ఉత్తరప్రదేశ్ పోలీస్ విభాగంలో గడ్డం పెంచుకోవడంపై అమల్లో ఉన్న నిషేధాన్ని సవాల్ చేస్తూ ఓ కానిస్టేబుల్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా ధర్మాసనం పై వ్యాఖ్య చేసింది. ఆ పిటిషన్ను తిరస్కరించింది. అదేవిధంగా కానిస్టేబుల్ సస్పెన్షన్ విషయంలో జోక్యం చేసుకోవడానికి కూడా న్యాయస్థానం నిరాకరించింది.
గడ్డం పెంచుకోవడం కారణంగా సస్పెన్షన్కు గురైన కానిస్టేబుల్ మహ్మద్ ఫర్మాన్ రెండు వేర్వేరు పిటిషన్లపై లక్నోలోని జస్టిస్ రాజేష్సింగ్ చౌహాన్ నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం ఇవాళ విచారణ జరిపింది. అయోధ్య జిల్లాలోని ఖందాస పోలీస్స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేసే మహ్మద్ ఫర్మాన్ గడ్డం పెంచుకుని విధులకు హాజరుకావడంతో ఆయోధ్య డీఐజీ అతడిని విధుల నుంచి తొలగించారు. అంతేగాక యూపీ పోలీస్ రూల్స్ను అతిక్రమించినందుకు అతనిపై చార్జీషీట్ దాఖలు చేశారు.
దాంతో తన సస్పెన్షన్ ఆర్డర్ను, యూపీ పోలీస్ రూల్స్ను సవాల్ చేస్తూ కానిస్టేబుల్ మహ్మద్ ఫర్మాన్ లక్నో బెంచ్లో రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. గడ్డం పెంచుకోవడం అనేది తమకు రాజ్యంగం కల్పించిన మతస్వేచ్ఛ హక్కు కిందకు వస్తుందని, తాను ముస్లిం సూత్రాలకు లోబడి గడ్డం పెంచుకున్నానని పిటిషనర్ తన పిటిషన్లో పేర్కొన్నారు. కానీ, యూపీ పోలీస్ రూల్స్ ప్రకారం గడ్డం పెంచుకోవడంపై నిషేధం ఉన్నదని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాధించారు. రెండు వర్గాల వాదనలు విన్న రాజేస్ సింగ్ చౌహాన్ తాజా తీర్పు వెలువరించారు.