చెన్నై: నటన నుంచి రాజకీయాల్లోకి వచ్చిన కమల్ హాసన్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. త్వరలో జరుగనున్న ఈరోడ్ ఈస్ట్ ఉప ఎన్నికలో డీఎంకే-కాంగ్రెస్ కూటమికి మద్దతు ఇచ్చారు. పోటీలో నిలిచిన కాంగ్రెస్ అభ్యర్థి ఇలంగోవన్కు ఆయన పార్టీ ఎంఎన్ఎం మద్దతును బుధవారం ప్రకటించారు. తమిళనాడు కాంగ్రెస్ కమిటీ (టీఎన్సీసీ) మాజీ చీఫ్ ఎలంగోవన్ ఉప ఎన్నికలో భారీ మెజార్టీతో విజయం సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయనను భారీ మెజార్టీతో గెలిపించాలని ఈరోడ్ ఈస్ట్ ఓటర్లను అభ్యర్థించారు. ఇళంగోవన్ వ్యక్తిగతంగా కలిసి ఎంఎన్ఎం మద్దతును కోరిన రెండు రోజుల తర్వాత ఆయన ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యత సంతరించుకున్నది.
కాగా, తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే-కాంగ్రెస్ కూటమికి ఎంఎన్ఎం మద్దతు కేవలం ఉప ఎన్నికకు మాత్రమే పరిమితమిని కమల్ హాసన్ తెలిపారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో డీఎంకే లేదా కాంగ్రెస్తో పొత్తు గురించి ఇప్పుడే ఏం చెప్పలేమని అన్నారు. అయితే భారత బహుళత్వమే తమకు ముఖ్యమని ఆయన తెలిపారు. దేశంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఒకే ఆలోచన ఉన్న పార్టీలు ఏకతాటిపైకి రావడం, బహుళత్వాన్ని కాపాడుకోవడం చాలా అవసరమన్నారు. భారత దేశ లౌకికవాదంతో పాటు బహుళత్వాన్ని కాపాడేందుకు తాను పోరాడతానని కమల్ హాసన్ తెలిపారు.