Today History: దేశంలోనే తొలి పైలట్ లైసెన్స్ పొందిన వ్యక్తిగా జేఆర్డీ టాటా భారతదేశం చరిత్రలో నిలిచిపోయారు. ఆయన 1929 సరిగ్గా ఇదే రోజున కమర్షియల్ పైలట్ లైసెన్స్ పొందారు. విమానయానం అంటే అమితాసక్తి కలిగిన జేఆర్డీ టాటా.. 1932 లో తొలిసారిగా మన దేశంలో టాటా ఎయిర్లైన్స్ ప్రారంభించి కొత్త శకానికి నాందీ పలికారు. అనంతర కాలంలో ఇదే ఎయిర్లైన్స్ కాస్తా ఎయిరిండియాగా మారింది. అయితే, ప్రైవేటీకరణ నేపథ్యంలో ఇన్నేండ్ల తర్వాత తిరిగి అదే ఎయిరిండియా తిరిగి టాటాల చేతుల్లోకి రావడం విశేషం.
జేఆర్డీ టాటా1932 అక్టోబరు 15 న ఉదయం 6.35 గంటలకు కరాచీలోని డ్రిగ్ రోడ్ విమానాశ్రయంలోని పస్ మోత్ విమానంలో ముంబైకి బయల్దేరారు. మార్గమధ్యంలో అహ్మదాబాద్లో నిలిచిపోగా.. ఆగర్ షెల్ నాలుగు గ్యాలన్ల పెట్రోల్ క్యాన్లను ఎడ్లబండిపై తీసుకొచ్చి విమానంలోకి ఎక్కించారు. అనంతరం తిరుగు ప్రయాణమై ముంబైలోని జుహు విమానాశ్రయానికి చేరుకున్నది. ఈ విమానంలో ప్రయాణికులు ఎవరూ లేరు. అందులో 27 కిలోల బరువున్న లేఖలను ఇంపీరియల్ ఎయిర్వేస్ లండన్ నుంచి కరాచీకి తీసుకువచ్చింది.
1933 లో టాటా ఎయిర్లైన్స్ తమ వ్యాపారాన్ని ప్రారంభించింది. కేవలం రూ. 2 లక్షల వ్యయంతో ఏర్పాటైన టాటా సన్స్ కంపెనీ అదే ఏడాది 155 మంది ప్రయాణికులు, దాదాపు 11 టన్నుల మెయిల్ను తీసుకెళ్లడం ద్వారా చరిత్ర సృష్టించింది. బ్రిటిష్ రాయల్ ఎయిర్ ఫోర్స్ పైలట్ హోమీ భరుచా టాటా ఎయిర్లైన్స్కు మొదటి పైలట్. జేఆర్డీ టాటా, విన్సెంట్ రెండు, మూడో పైలట్లు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఈ ఎయిర్లైన్స్ను పునరుద్ధరించారు. అయితే, టాటా ఎయిర్లైన్స్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మారి, దాని పేరును ఎయిరిండియా లిమిటెడ్గా నామకరణం చేశారు. 1947లో భారత ప్రభుత్వం ఎయిరిండియాలో 49 శాతం భాగస్వామ్యాన్ని తీసుకున్నది. దాదాపు 75 ఏండ్ల తర్వాత ప్రభుత్వం తన భాగస్వామ్యాన్ని అమ్మకానికి పెట్టడంతో ఎయిరిండియా తిరిగా టాటాల చేతుల్లోకి వెళ్లిపోయింది.