జెంషడ్పూర్: ఆయన ఆరోగ్యశాఖ మంత్రి. దవాఖానలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి వెళ్లారు. ఇంతలో ఓ మహిళ వచ్చి తన భర్తకు అత్యవసరంగా రక్తం అవసరముందని మంత్రి దృష్టికి తీసుకొచ్చింది. దీంతో స్పందించిన ఆయన రక్తదానం చేశారు.
జార్ఖండ్ ఆరోగ్యశాఖ మంత్రి బన్నా గుప్తా (Banna Gupta) జెంషడ్పూర్లోని సర్కారు దవాఖానకు వెళ్లారు. అక్కడ సీటీ స్కానర్, ఎక్స్-రే, ఆల్ట్రాసౌండ్ యంత్రాలను ప్రారంభించారు. దవాఖానకు మంత్రి వచ్చారని తెలుసుకున్న ఓ బాధితురాలు నేరుగా ఆయన వద్దకు వెళ్లింది. తన భర్త ఇక్కడ చికిత్స పొందుతున్నారని, అత్యవసరంగా రక్తం అవసరముందని చెప్పింది. తనకు రక్త దాత ఎవరూ దొరకలేదని తెలిపింది. దీంతో స్పందించిన ఆయన.. వెంటనే స్వయంగా రక్తదానం చేశారు. దీంతో ఏకంగా మంత్రి రక్తదానం చేయడంతో ఆమె ఆనందం వ్యక్తంచేసింది.
కాగా, మనిషిగా తన బాధ్యత నిర్వర్తించానని, ఒక సోదరి భర్త ప్రాణాలు నిలపడంలో తనవంతు సాయం అందించానని మంత్రి గుప్తా చెప్పారు.