రాంచీ : ఓ ఐఐటీ విద్యార్థిని పట్ల లైంగిక వేధింపులకు పాల్పడిన ఐఏఎస్ ఆఫీసర్ను జార్ఖండ్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఖుంతి జిల్లా సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్గా విధులు నిర్వర్తిస్తున్న అహ్మద్ను మంగళవారం పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అతన్ని రిమాండ్కు తరలించారు. తనను లైంగికంగా వేధింపులకు గురి చేసినట్లు ఓ విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అహ్మద్ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనపై జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ తీవ్రంగా స్పందించారు. అహ్మద్ను విధుల నుంచి తొలగించాలని ఆదేశించారు.
ఓ ఐఐటీకి చెందిన ఎనిమిది మంది ఇంజినీరింగ్ విద్యార్థులు వర్క్ షాప్ పని నిమిత్తం ఖుంతి జిల్లాకు వచ్చారు. ఈ ఎనిమిది మందిలో ఒక అమ్మాయి కూడా ఉంది. అయితే వర్క్ షాప్లో భాగంగా డిప్యూటీ డెవలప్మెంట్ కమిషనర్ ఇంట్లో శనివారం రాత్రి విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు ఇంజినీరింగ్ విద్యార్థులు కూడా అటెండ్ అయ్యారు. ఈ క్రమంలో ఆ అమ్మాయిని అహ్మద్ లైంగికంగా వేధించారు. ఈ విషయాన్ని బాధితురాలు పోలీసులకు తెలిపింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అహ్మద్ను అరెస్టు చేసి, రిమాండ్కు తరలించారు.