రాంచి: సరైన విద్య లేకనే రాష్ట్రం అభివృద్ధిలో వెనుకబడిందని జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ వ్యాఖ్యానించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి రాష్ట్రాన్ని అభివృద్ధి బాట పట్టించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఆయన చెప్పారు. రాంచిలో గాస్నెర్ కాలేజీ గోల్డెన్ జూబ్లీ సెలెబ్రేషన్కు ముఖ్య అతిథిగా హాజరైన హేమంత్ సోరెన్.. తన ప్రసంగంలో పై వ్యాఖ్యలు చేశారు.
విద్య లేక జార్ఖండ్ రాష్ట్రం వెనుకబడింది. అయితే పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం కోసం తమ ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నది. ఇటీవల కరోనా మహమ్మారి కూడా విద్యపై తీవ్ర ప్రభావం చూపింది. ఆన్లైన్లో విద్యాబోధన జరిగినప్పటికీ.. అందులో సానుకూలతలకు తోడు ప్రతికూలతలు కూడా ఉన్నాయి అని హేమంత్ సోరెన్ వ్యాఖ్యానించారు. విద్యారంగంలో, గిరిజనుల అభివృద్ధిలో వివిధ మిషనరీలు పోషిస్తున్న పాత్రను ఆయన కొనియాడారు.