బెంగళూరు: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) శ్రీహరికోట నుంచి జీఎస్ఎల్వీ-ఎఫ్17 మిషన్ ద్వారా అత్యాధునిక భూపరిశీలన ఉపగ్రహం ఈవోఎస్-05ను ప్రయోగించేందుకు సిద్ధమైంది. శుక్రవారం తెల్లవారుజామున 2:55 గంటలకు ప్రయోగం చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించిన కౌంట్డౌన్ మొదలైంది. తొలి సంవత్సరాల్లో వరుస అనూహ్య ప్రదర్శనల కారణంగా ఈ రాకెట్ ఇస్రోలో ‘నాటీ బాయ్’ అనే మారుపేరును సంపాదించుకున్నది.
ఈ రాకెట్ అభివృద్ధి పదేపదే ఎదురుదెబ్బలతో సాగింది. దాని మొదటి 18 ప్రయోగాల్లో ఆరు లక్ష్యాన్ని సాధించడంలో విఫలమయ్యాయి. తాజాగా మరోసారి ప్రయోగం చేపట్టనున్నారు. భూమికి సుమారు 36,000 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న జియోసింక్రోనస్ కక్ష్య నుంచి ఈవోఎస్-05 ఉపగ్రహం పనిచేస్తుంది. అందువల్ల ఒక నిర్దిష్ట ప్రాంతాన్ని నిరంతరం పర్యవేక్షించే అవకాశం లభిస్తుంది. తక్కువ కక్ష్యల్లో ఉండే ఉపగ్రహాలు ఒక ప్రాంతం మీదుగా ఎప్పటికప్పుడు దాటిపోతుంటాయి. కానీ జియోసింక్రోనస్ ఉపగ్రహం ఒకే ప్రాంతంపై సుదీర్ఘకాలం పాటు దృష్టి పెట్టగలదు. జీశాట్-1ఏగా కూడా పిలిచే ఈవోఎస్-05 భారత ఉపఖండానికి సంబంధించిన చిత్రాలను తరచూ అందించేలా రూపొందించబడింది. ముఖ్యంగా భారత్ తన సరిహద్దులు, వ్యూహాత్మక ప్రాంతాలపై నిఘా ఉంచడానికి ఇది ఎంతో కీలకం కానున్నది.