ISRO | జీఎస్ఎల్వీ-ఎఫ్17/ఈఓఎస్-05 ప్రయోగం భారత్ అంతరిక్ష కార్యక్రమంలో చారిత్రక విజయమని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఛైర్మన్ డాక్టర్ వి. నారాయణన్ అన్నారు. శ్రీహరికోట నుంచి ప్రయోగించిన జీఎస్ఎల్వీ-ఎఫ్17 వాహకనౌక 2,367 కిలోల బరువున్న అత్యాధునిక భూ పరిశీలన ఉపగ్రహం ఈఓఎస్-05ను నిర్దేశిత సబ్-జియోసింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్లోకి అత్యంత కచ్చితత్వంతో ప్రవేశపెట్టిందని తెలిపారు. రాకెట్లోని అన్ని వ్వయస్థలు అద్భుతంగా పనిచేస్తున్నాయని పేర్కొన్నారు.
శ్రీహరికోట నుంచి జరిగిన ప్రయోగాల్లో ఇది 107వ మిషన్ కాగా.. జీఎస్ఎల్వీ వాహకనౌకకు 19వ ప్రయోగమని నారాయణన్ తెలిపారు. జీఎస్ఎల్వీ తొలి ప్రయోగమైన డీ1లో 1,536 కిలోల బరువున్న ఉపగ్రహాన్ని మాత్రమే మోసుకెళ్లగా.. నిర్మాణ రూపకల్పన, ప్రొపల్షన్ వ్యవస్థల్లో చేసిన నిరంతర అభివృద్ధితో రాకెట్ సామర్థ్యం గణనీయంగా పెరిగిందన్నారు. తాజాగా 2,367 కిలోల బరువున్న ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టడం జీఎస్ఎల్వీ సామర్థ్యానికి నిదర్శనమని చెప్పారు.
ఈఓఎస్-05 అందుబాటులోకి వచ్చిన తర్వాత జియోసింక్రోనస్ కక్ష్యలో భారత్కు తొలి అంకిత భూ చిత్రీకరణ ఉపగ్రహంగా నిలవనుందని ఇస్రో ఛైర్మన్ తెలిపారు. జీఎస్ఎల్వీ-ఎఫ్17 విజయానికి ఇస్రో శాస్త్రవేత్తలు, పరిశ్రమ భాగస్వాములు, విద్యా సంస్థల సమష్టి కృషి కారణమని నారాయణన్ పేర్కొన్నారు. ఇస్రోలోని వివిధ విభాగాల మధ్య సమన్వయం, సంస్థ అనుసరిస్తున్న ఓపెన్ వర్క్ కల్చర్, కఠినమైన సమీక్షా విధానాలు ఈ విజయానికి దోహదపడ్డాయని చెప్పారు. ఈ మిషన్ కోసం పనిచేసిన మాజీ ఇస్రో అధిపతులు, శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు, వారి కుటుంబ సభ్యులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ISRO-Chief-Narayan says-GSLV-F17-Mission-EOS-05-is-historical success
“ఇది దేశ అంతరిక్ష కార్యక్రమంలో గొప్ప విజయం” అని నారాయణన్ అన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇస్రో మరో ఆరు ప్రయోగాలను చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు నారాయణన్ వెల్లడించారు. వీటిలో ఈ ఏడాది చేపట్టనున్న మానవ రహిత గగన్యాన్ మిషన్ కూడా ఉందని తెలిపారు.
జీఎస్ఎల్వీ-ఎఫ్17 మిషన్ విజయంపై మిషన్ డైరెక్టర్ థామస్ కురియన్ హర్షం వ్యక్తం చేశారు. ఇది తమందరికీ గొప్ప గర్వం, ఆనందం కలిగించే క్షణమని అన్నారు. ఈ ప్రయోగంతో జీఎస్ఎల్వీ 19వ మిషన్ను విజయవంతంగా పూర్తి చేసిందని తెలిపారు. జీఎస్ఎల్వీ ఇప్పటివరకు జీటీఓ లేదా సబ్-జీటీఓ కక్ష్యలోకి ప్రవేశపెట్టిన ఉపగ్రహాల్లో ఈఓఎస్-05 అత్యంత బరువైనదని చెప్పారు. రాకెట్ నింగిలోకి దూసుకెళ్లి కక్ష్యలోకి ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టే ప్రక్రియ కొద్ది నిమిషాల్లో పూర్తయినప్పటికీ.. దాని వెనుక నెలలు, సంవత్సరాల పాటు సాగిన కఠినమైన శ్రమ ఉంటుందని కురియన్ తెలిపారు. ఇస్రోలోని వివిధ బృందాలు సమన్వయంతో చేసిన నిరంతర కృషి ఫలితంగానే ఈ విజయాన్ని సాధించగలిగామని పేర్కొన్నారు.
#WATCH | Sriharikota, Andhra Pradesh: On the launch of GSLV-F17/EOS-05 mission, ISRO Chief V Narayanan says, “… This vehicle’s capability is 2250 kgs… The predicted performance of the approach was 29934 km, against that we have got 31000 kilometers, and this is the capability… pic.twitter.com/i9bQgP9hCw
— ANI (@ANI) September 4, 2026