న్యూఢిల్లీ: ద ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణా కాన్సియస్నెస్(ISKCON) తమ గోశాలల్లో ఉన్న గోవుల్ని అమ్ముకుంటున్నదని బీజేపీ ఎంపీ మేనకా గాంధీ(Maneka Gandhi) ఆరోపించారు. ఆ గోవుల్ని కబేళాలకు అమ్ముకుంటోందన్నారు. దేశంలో జరుగుతున్న అతిపెద్ద మోసమని ఆమె అన్నారు. బీజేపీ ఎంపీ చేసిన తీవ్ర ఆరోపణల్ని ఇస్కాన్ ఖండించింది. ఆ ఆరోపణలు నిరాధారమైనవని, తప్పుడువని ఇష్కాన్ పేర్కొన్నది. గోవులు, ఆవుల సంరక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తామని ఇస్కాన్ జాతీయ ప్రతినిధి యుదిష్టర్ గోవింద దాస్ తెలిపారు. కేవలం ఇండియాలోనే కాదు, యావత్ ప్రపంచవ్యాప్తంగా తాము గోవుల్ని ఆదరించనున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది. గోవులకు జీవితాలను ప్రసాదిస్తున్నామని, వాటిని కబేళాలకు అమ్మడం లేదని ఇస్కాన్ చెప్పింది. ఇస్కాన్ ప్రతినిధి తన సోషల్ మీడియా అకౌంట్ ఎక్స్లో ఈ విషయాన్ని తెలిపారు.
ప్రభుత్వం నుంచి లబ్ధి పొందుతన్న ఇస్కాన్, తమ గోశాలల్లో ఉన్న గోవుల్ని అమ్ముకుంటున్నట్లు మేనకా గాంధీ చేసిన ఆరోపణలనకు చెందిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఇటీవల ఏపీలోని అనంతపురంలో ఉన్న గోశాలను సందర్శించినట్లు ఆమె చెప్పారు. అక్కడ పాలు ఇచ్చే ఆవు ఒక్కటి కూడా లేదని, దూడలు కూడా లేవని, మొత్తం డెయిరిలో ఒక్కటి కూడా పాలిచ్చే ఆవు లేదని, అంటే అక్కడ ఉన్న ఆవుల్ని అమ్ముకున్నారని తెలుస్తోందని ఆమె ఆరోపించారు. ఆవుల్ని అమ్ముకుంటున్న ఇస్కాన్ .. రోడ్డు మీద మాత్రం హరే రామ హరే కృష్ణ అని అంటోందన్నారు. ఇస్కాన్ వాళ్లు అమ్మినంతగా మరెవరు కబేళాలకు ఆవుల్ని అమ్మరని మేనకా గాంధీ ఆరోపించారు.