Naveen Jindal | త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో హర్యానాలో కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ప్రముఖ పారిశ్రామికవేత్త, మాజీ ఎంపీ నవీన్ జిందాల్ కాంగ్రెస్ పార్టీకి గుడ్బై చెప్పారు. ఆదివారం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో చేరారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ `వికసిత్ భారత్` ఎజెండా అమలులో భాగస్వాముడిని కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే సమక్షంలో నవీన్ జిందాల్ బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా వినోద్ తావ్డే మాట్లాడుతూ బీజేపీలో నవీన్ జిందాల్ చేరికతో దేశ ఆర్థిక వ్యవస్థ పురోభివృద్ధికి, శ్రేయస్సుకు దోహదం చేస్తుందని వ్యాఖ్యానించారు. జిందాల్ స్టీల్ చైర్పర్సన్గా, క్రీడలు, విద్యారంగం పట్ల నవీన్ జిందాల్ ఆసక్తి ప్రదర్శించే వారని పేర్కొన్నారు.
2004-14 మధ్య హర్యానాలోని కురుక్షేత్ర నుంచి లోక్సభకు నవీన్ జిందాల్ ప్రాతినిధ్యం వహించారు. ఈ సందర్భంగా నవీన్ జిందాల్ మీడియాతో మాట్లాడుతూ.. గత పదేండ్లలో ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో ఎంతో అభివృద్ధి చెందిందని చెప్పారు. 370 అధికరణం రద్దు వంటి చారిత్రక చర్యలు చేపట్టారన్నారు. అయోధ్యలో రామ మందిరం నిర్మించాలన్న భారతీయుల కల సాకారం చేశారని గుర్తు చేశారు.