ముంబై : షీనాబోరా మత్య కేసులో ప్రధాన నిందితురాలైన ఇంద్రాని ముఖర్జీ జైలు నుంచి విడుదలయ్యారు. ముంబైలోని బైకులా జైలు నుంచి ఆరున్నర సంవత్సరాల తర్వాత శుక్రవారం బయటకు వచ్చారు. సుప్రీం కోర్టు రెండు రోజుల కిందట ఇంద్రాణికి బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. జైలు నుంచి బయటకు వచ్చిన అనంతరం ఇంద్రాణి ముఖర్జీ మాట్లాడుతూ సంతోషంగా ఉన్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా.. షీనాబోరా హత్యకేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న ఇంద్రాణి ముఖర్జీ గత ఆరున్నర సంవత్సరాలుగా జైలులో ఉన్నారు. షీనాబోరా హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
ఏప్రిల్, 2012 సంవత్సరంలో 24 ఏళ్ల షీనా బోరాను ఇంద్రాణి ముఖర్జీ, ఆమె అప్పటి డ్రైవర్ శ్యాంవర్ రాయ్, ఆమె మాజీ భర్త సంజీవ్ ఖన్నాలతో కలిసి కారులో గొంతుకోసి చంపారు. ఆ తర్వాత రాయ్గఢ్ జిల్లాలోని అడవిలో ఆమె మృతదేహాన్ని కాల్చివేసినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు దేశవ్యాప్తంగా పెను సంచలన సృష్టించింది. ఇంద్రాణి బెయిల్ పిటిషన్పై బుధవారం సుప్రీం కోర్టు విచారణ జరిపింది. ఆమె తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. గత 11 నెలలుగా విచారణలో ఎలాంటి ప్రగతి లేదని, ఇప్పటి వరకు 237 మంది సాక్షులను విచారించారని కోర్టుకు తెలిపారు. ఇప్పటి వరకు ఆమెకు పెరోల్ కూడా లభించలేదని తెలిపారు. ఈ కారణాల నేపథ్యంలో సెక్షన్ 437 కింద ఆమె ప్రత్యేక విడుదలకు అర్హురాలని చెప్పారు. ఆమెకు బెయిల్ మంజూరు చేయాలని కోర్టును కోరారు. ఈ మేరకు వాదనలు విన్న సుప్రీం కోర్టు బెయిల్ను మంజూరు చేసింది.
సందర్భోచిత సాక్ష్యాలపై ఈ కేసు ఆధారపడి ఉందని, కేసు మెరిట్లపై మేము వ్యాఖ్యలు చేయడం లేదని, 50 శాతం మంది సాక్షులను ప్రాసిక్యూషన్ అప్పగించినా, విచారణ త్వరగా ముగిసే పరిస్థితి కనిపించడం లేదని, అందువల్ల ఇంద్రాణికి బెయిల్ మంజూరు చేస్తున్నట్లు పేర్కొంది. ట్రయల్ కోర్టు సంతృప్తి మేరకు ఆమె బెయిల్పై విడుదలవుతుదని, పీటర్ ముఖర్జియాకు విధించిన షరతులే ఆమెకు కూడా వర్తిస్తాయని సుప్రీం కోర్టు పేర్కొంది. అయితే, 2021 డిసెంబర్ 16న ఇంద్రాణి గత నెలలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) డైరెక్టర్కు రాసిన లేఖలో తన కూతురు షీనా బతికే ఉందని, ప్రస్తుతం కశ్మీర్లో ఉందని పేర్కొంది.