Foreign Education | హైదరాబాద్, నవంబర్ 13(నమస్తే తెలంగాణ)/న్యూఢిల్లీ: ఉన్నత చదువుల నిమిత్తం అమెరికాకు వెళ్తున్న భారతీయుల సంఖ్య ఏటా పెరుగుతున్నది. 2022-23లో మొత్తం 2,68,923 మంది భారతీయ విద్యార్థులు అమెరికాలో అడుగుపెట్టారని, కిందటి ఏడాదితో పోల్చుకుంటే విద్యార్థుల సంఖ్య 35 శాతం పెరిగిందని ‘ఓపెన్ డోర్స్’ నివేదిక వెల్లడించింది. ప్రస్తుతం అమెరికాలోని విద్యా సంస్థల్లో దాదాపు 10లక్షల మందికిపైగా అంతర్జాతీయ విద్యార్థులు వివిధ కోర్సులు చదువుతున్నారు.
ఇందులో భారతీయ విద్యార్థుల సంఖ్య దాదాపు 25శాతానికి చేరుకుంది. అమెరికాలో విద్యా అవకాశాలు, సమగ్రమైన, కచ్చితమైన, తాజా సమాచారం కోసం ఆ దేశ విదేశాంగ శాఖ 6 ఉచిత సలహా కేంద్రాల్ని భారత్లో ఏర్పాటుచేసింది. ఇందులో రెండు కేంద్రాలు హైదరాబాద్లో ఉండటం గమనార్హం. ‘ఓపెన్ డోర్స్ రిపోర్ట్ డాటా’ ప్రకారం, ఈ సారి గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్లో 1.65 లక్షల మందితో 62.6 శాతం పెరుగుదల నమోదైంది. గత ఏడాదితో పోల్చుకుంటే సుమారు 64 వేలమంది అధికంగా అమెరికాకు వెళ్లారు. అలాగే, అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల్లో 16 శాతం పెరుగుదల నమోదైంది. ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపీటీ)కు అవకాశం కల్పించే కోర్సుల్లో భారత్ నుంచి 69 వేల మంది అడ్మిషన్లు పొందారు.