Foreign Education | న్యూఢిల్లీ, మార్చి 11 : విదేశాలలో ఉన్నత విద్యపై భారతీయ విద్యార్థులకు మక్కువ తగ్గింది. గత ఏడాది గణాంకాలు పరిశీలిస్తే విదేశాలకు వెళ్లిన విద్యార్థుల సంఖ్యలో 15 శాతం తగ్గుదల నమోదైంది. కొవిడ్ తర్వాత ఇలా తగ్గుదల నమోదవ్వడం ఇదే ప్రథమం. 2023లో వీరు 8,92,989 మంది ఉండగా, 2024 నాటికి 7,59,064కు పడిపోయింది. ముఖ్యంగా, కెనడా, అమెరికా, యూకేలకు వెళ్లే వారి సంఖ్య భారీగా తగ్గిందని బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ డాటా వెల్లడించింది. 2024లో ఈ మూడు దేశాల్లోనే 27 శాతం విద్యార్థులు తగ్గినట్టు తెలిపింది. కఠినతర వీసా నిబంధనలు, ఎక్కువ మొత్తంలో ఫీజులు, ఇతర ఆర్థిక డిమాండ్లు, పెరిగిన తిరస్కరణలు, ఆయా దేశాల్లోని దౌత్యపరమైన సమస్యలు ఈ తగ్గుదలకు కారణంగా అంచనా వేస్తున్నారు.
అదే సమయంలో ప్రత్యామ్నాయ దేశాలైన రష్యా, జర్మనీ, ఉజ్బెకిస్థాన్, బంగ్లాదేశ్లకు వెళ్లే విద్యార్థుల సంఖ్య పెరిగింది. బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ వెల్లడించిన డాటా ప్రకారం గత ఏడాదితో పోలిస్తే 2024లో యూఎస్, యూకే, కెనడా వెళ్లే విద్యార్థుల సంఖ్య 1,64,370 తగ్గింది. ఇందులో కెనడాకు 41 శాతం అధిక తగ్గుదల నమోదైంది. ఈ దేశానికి 2023లో 2,33,532 మంది వెళ్లగా, 2024లో ఈ సంఖ్య 1,37,608 మాత్రమే. అలాగే యూకే, అమెరికాలకు కూడా వరుసగా 27, 13 శాతం తగ్గుదల నమోదైంది. అదే సమయంలో రష్యాకు 34 శాతం విద్యార్థుల సంఖ్య పెరిగింది. అందుబాటులో విద్య, సులభతరమైన వీసా విధానాలు, విద్యాసంస్థల భాగస్వామిక ఒప్పందాల వల్ల విద్యార్థులకు ప్రత్యామ్నాయ, ఆకర్షణీయ దేశంగా రష్యా కన్పిస్తున్నది.
2023-8,92,989 2024-7,59,064
కెనడాకు వెళ్లే విద్యార్థుల్లో తగ్గుదల 41 ./.
రష్యాకు వెళ్లే విద్యార్థుల్లో పెరుగుదల 34./.