న్యూఢిల్లీ, డిసెంబర్ 15: రెండున్నర వేల ఏండ్ల క్రితం పాణిని రాసిన గొట్టు సూత్రం గుట్టును ఓ కుర్రమేధావి ఛేదించాడు. మహా వ్యాకరణ పండితులు తలలు బద్దలు కొట్టుకున్నా అంతుచిక్కని సమస్యకు ఓ 27 ఏండ్ల యువకుడు పరిష్కారం కనుగొన్నాడు. పాణిని సూత్రానికి సరైన భాష్యం చెప్పి చిక్కుముడిని విప్పాడు. సంస్కృతభాష వ్యాకరణ సూత్రాలను ‘అష్టాధ్యాయి’ పేరుతో పాణిని రాసిన సంగతి తెలిసిందే. ధాతు పదాల నుంచి కొత్త పదాలను రూపొందించడానికి సంబంధించిన సూత్రం వ్యాకరణ పండితులకు వందల సంవత్సరాలుగా కొరకరాని కొయ్యగా ఉండిపోయింది.
రెండు సమాన స్థాయి సూత్రాల మధ్య వైరుధ్యం ఏర్పడితే మొదటి దానికన్నా తర్వాతి దానికే ప్రాముఖ్యం ఇవ్వాలని ఇన్నాళ్లూ అందరూ భావిస్తూ వచ్చారు. కానీ ఇక్కడ చూడాల్సింది ముందు, వెనుక అని కాదు. ఎడమ, కుడిగా చూస్తే సమస్య పరిష్కారం అవుతుందని తేల్చాడు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో పీహెచ్డీ చదువుతున్న రిషీ రాజపోపట్. దీనికి ఉదాహరణగా ‘జ్ఞానం దియతే గురునా’ అనే వాక్యాన్ని తీసుకొని సరికొత్త భాష్యం చెప్పాడు. ‘జ్ఞానం గురువు ద్వారా ఇవ్వబడుతుంది’ అని ఆ వాక్యానికి అర్థం. ఇక్కడ ‘ఇచ్చువాడు’ అనే అర్థంలో ‘గురునా’ను ఉపయోగించారు.
ఇందులో ‘గురు’, ‘ఆ’ అనే ధాతువులున్నాయి. పాణిని సూత్రాన్ని సరిగా అర్థం చేసుకొంటే ఇక్కడ కుడివైపున ‘ఆ’ ఉంది. దానికి ముందు ‘న’కారం చేరిస్తే ‘గురునా’ అనే పదం ఏర్పడుతుంది. ఇన్నాళ్లుగా తప్పుడు భాష్యంతో మల్లగుల్లాలు పడుతున్న పండిత లోకానికి రిషీ కండ్లు తెరిపించాడు. జయాదిత్య, వామనులు తమ ‘కాశికావృత్తి’లో, పతంజలి ‘మహాభాష్యం’లో, కాత్యాయనుడు ‘వార్తికకార’లో ఈసమస్య పరిష్కారానికి ప్రయత్నించి విఫలమయ్యారు. నిజానికి రిషి కూడా రాత్రికిరాత్రే పరిష్కారం కనుక్కోలేదు. చాన్నాళ్లుగా దాంతో కుస్తీపట్టాడు. ఇక నావల్ల కాదనుకొన్నాడు. పుస్తకాలు పక్కన పడేసి వేసవి సెలవులపై వెళ్లాడు. యాత్రావిహారాలు చేశాడు. సైక్లిం గ్, వంట, ధ్యానం వంటివాటిలో సమ యం గడిపేశాడు. అదలా సాగుతున్న దశలో హఠాత్తుగా పరిష్కారం తట్టింది. ఆర్కిమెడిస్ లాగా ‘యురేకా’ అని ఎగిరి గంతేశానని చెప్తున్నాడు రిషీ రాజపోపట్.