న్యూఢిల్లీ/ వాషింగ్టన్: అమెరికాలో పోలీస్ వాహనం ఢీకొనడంతో మరణించిన తెలుగు విద్యార్థిని కందుల జాహ్నవికి (Jaahnavi Kandula) మరణాంతరం డిగ్రీ ప్రదానం చేయనున్నట్లు ఆమె చదువుతున్న యూనివర్సిటీ తెలిపింది. మాస్టర్స్ డిగ్రీ పట్టాను జాహ్నవి కుటుంబానికి అందజేస్తామని పేర్కొంది. ఆమె అకాల మరణంపట్ల నార్త్ఈస్టర్న్ యూనివర్సిటీ ఛాన్సలర్ సంతాపం తెలిపారు. ఈ దుర్ఘటన వల్ల భారతీయ విద్యార్థులపై పడే ప్రభావాన్ని తాము అర్థం చేసుకోగలమని అన్నారు. జాహ్నవి కుటుంబానికి మద్దతుగా ఉంటామని, కేసు దర్యాప్తులో న్యాయం జరిగేలా సహకరిస్తామని చెప్పారు. విద్యార్థుల సహాయం కోసం ఒక హెల్ప్లైన్ నంబర్ కూడా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఆ యూనివర్సిటీ జారీ చేసిన ప్రకటనలో ఈ మేరకు పేర్కొన్నారు.
కాగా, ఆంధ్రప్రదేశ్లోని కర్నూలుకు చెందిన 23 ఏండ్ల కందుల జాహ్నవి అమెరికా సౌత్ లేక్ యూనియన్లోని నార్త్ఈస్టర్న్ యూనివర్సిటీ సీటల్ క్యాంపస్లో మాస్టర్స్ డిగ్రీ చదువుతున్నది. ఈ ఏడాది జనవరిలో రోడ్డు దాటుతుండగా వేగంగా వెళ్తున్న పోలీస్ వాహనం ఢీకొట్టింది. గాల్లో ఎగిరి రోడ్డుపై పడిన ఆమె ఈ ప్రమాదంలో చనిపోయింది.
మరోవైపు భారతీయ విద్యార్థిని జాహ్నవి మరణం పట్ల సీటెల్ పోలీస్ అధికారి డేనియల్ ఆడెరర్ చాలా చులకనగా, ఎగతాళిగా మాట్లాడాడు. ఆమె ప్రాణాలకు విలువలేదని తన సహోద్యోగితో అన్నాడు. డేనియల్ నవ్వుతూ.. ‘ఆమె చనిపోయింది. సాధారణ వ్యక్తి’ అని తెలిపాడు. అలాగే మళ్లీ నవ్వుతూ.. ‘ఒక చెక్ రాయండి. పదకొండు వేల డాలర్లకు’ అని చెప్పాడు. ఆమె వయసు 26 ఏండ్లని, ఆమె ప్రాణాలకు విలువ లేదని నవ్వుతూ అన్నాడు.
అయితే, ఫోన్లో మాట్లాడిన ఈ సంభాషణ ఆ పోలీస్ అధికారి బాడీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఈ ఆడియో క్లిప్ను సీటెల్ పోలీస్ డిపార్ట్మెంట్ సోమవారం విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ఇది వైరల్ కావడంతో పోలీస్ అధికారి డేనియల్ తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ సంఘటనపై కొందరు నిరసన వ్యక్తం చేశారు. ఆ పోలీస్ అధికారిపై చర్యలకు భారత్ కూడా డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో అతడిపై దర్యాప్తు చేస్తున్నట్టు సీటెల్ పోలీస్ డిపార్ట్మెంట్ పేర్కొంది.