న్యూఢిల్లీ: పశ్చిమాసియా యుద్ధం కారణంగా ఏర్పడిన క్లిష్టమైన ప్రపంచ పరిస్థితులు చాలా కాలం పాటు కొనసాగే అవకాశం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం తెలిపారు. కొవిడ్-19 మహమ్మారి సమయంలో దేశం ఐక్యంగా నిలబడినట్లే ఇప్పుడు కూడా సంసిద్ధంగా, ఐక్యంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. లోక్సభలో ఒక ప్రకటన చేస్తూ ఇంధనం, ఎరువులు, జాతీయ భద్రత, దేశంలోని ఇతర రంగాలు, పశ్చిమాసియాలో నివసిస్తున్న భారతీయులపై యుద్ధ ప్రభావానికి సంబంధించిన ఆందోళనలను ప్రస్తావించారు. పశ్చిమాసియాలో పరిస్థితులు తీవ్ర ఆందోళనకరమని అన్నారు. యుద్ధంతో తీవ్ర పర్యవసనాలు ఎదురు కానున్నాయని, దీర్ఘ కాలిక ప్రభావానికి భారత్ సంసిద్ధం కావాలన్నారు.
‘యుద్ధంతో మొదలయ్యే మరో సవాల్.. భారత్లో వేసవి మొదలుకానున్నది. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతల పెరుగుదలతో విద్యుత్తుకు డిమాండ్ పెరుగనున్నది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అన్ని పవర్ ప్లాంట్లలో తగినన్ని బొగ్గు నిల్వలు ఉన్నాయి’ అని ప్రధాని పేర్కొన్నారు. భారత్ వద్ద 53 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలు ఉన్నాయని, మరో 65 లక్షల మెట్రక్ టన్నులకు పైగా పెట్రోలియం నిల్వలు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నదని ఆయన తెలిపారు. ఇవి గాకుండా దేశీయ చమురు కంపెనీల వద్ద కూడా నిల్వలు ఉన్నాయని ప్రధాని చెప్పారు. పశ్చిమాసియా సంక్షోభంపై భారత పార్లమెంట్ నుంచి ప్రపంచానికి ఒకే గొంతుక వెళ్లాలని పిలుపునిచ్చారు.