లక్నో: ఉత్తరప్రదేశ్లోని హత్రాస్లో సంచలనం రేపిన దళిత యువతిపై సామూహిక లైంగిక దాడి, హత్య కేసు (Hathras case) పై కోర్టు తీర్పు ఇచ్చింది. నలుగురు నిందితుల్లో ముగ్గురిని నిర్దోషులుగా పేర్కొంది. ప్రధాన నిందితుడు 20 ఏళ్ల సందీప్ ఠాకూర్ను ఎస్సీఎస్టీ చట్టం కింద దోషిగా నిర్ధారించింది. దళిత యువతిపై సామూహిక లైంగిక దాడి, హత్యలో అతడి ప్రమేయం లేదని తెలిపింది. దీంతో నిందితుడికి ఆ మేరకు తక్కువ శిక్ష పడనున్నది. అగ్ర వర్ణాలకు చెందిన సందీప్ ఠాకూర్ బంధువు 35 ఏళ్ల రవి, స్నేహితులు 23 ఏళ్ల లవ్ కుష్, 26 ఏళ్ల రామును నిర్దోషులుగా కోర్టు పేర్కొంది. ఈ మేరకు గురువారం తీర్పు ఇచ్చింది.
2020 సెప్టెంబర్లో హత్రాస్ జిల్లాలోని బూల్గర్హి గ్రామానికి చెందిన 19 ఏళ్ల దళిత యువతిని పొలాల్లోకి లాక్కెళ్లిన కొందరు వ్యక్తులు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. అనంతరం గొంతు నొక్కి హత్య చేసేందుకు ప్రయత్నించారు. తీవ్రంగా గాయపడిన ఆ యువతి ఢిల్లీలోని సఫ్దర్జంగ్ హాస్పిటల్లో 15 రోజులపాటు మృత్యువుతో పోరాడి మరణించింది. యువతి మృతదేహాన్ని గ్రామానికి తీసుకొచ్చిన పోలీసులు అర్ధరాత్రి వేళ గుట్టుగా దహనం చేశారు. ఆమె తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులను ఇంట్లో ఉంచి తాళం వేశారు.
కాగా, ఈ సంఘటన నాడు దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. బాధితురాలికి న్యాయం కోసం నిరసనలు వెల్లువెత్తాయి. దీంతో గ్రామంలోని అగ్ర వర్ణాలకు చెందిన నలుగురిని నిందితులుగా పేర్కొంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే సరైన ఆధారాలను కోర్టుకు సమర్పించలేదు. దీంతో నిందితుల్లో ముగ్గురిని నిర్ధోషులుగా ఎస్సీ, ఎస్టీ కోర్టు పేర్కొంది. ఆ చట్టం కింద ఒకరిని దోషిగా నిర్ధారించింది.
మరోవైపు కోర్టు తీర్పుపై బాధిత యువతి కుటుంబం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ తీర్పును హైకోర్టులో సవాల్ చేస్తామని తెలిపింది. అయితే కోర్టు తీర్పుపై పలు వర్గాలు కూడా అసంతృప్తి వ్యక్తం చేశాయి.