లక్నో, సెప్టెంబర్ 29: నేరం చేసినవారు జైలుకు వెళ్లి చిప్పకూడు తినడం సాధారణం. కానీ కొందరు ఉత్తరాది రాజకీయ నాయకులు జైలులో పెట్టే చిప్పకూడు ఇంటికి తెప్పించుకొని లొట్టలు వేసుకుంటూ ఆరగిస్తున్నారట. రుచిగా ఉంటుందనో, ఆరోగ్యానికి మంచిదనో వారు అలా చేయడం లేదు. తమ జాతకచక్రంలో ‘జైలుదోషం’ పోగొట్టుకోవడానికి అలా చేస్తున్నారు. అంటే జాతకంలో జైలుదోషం ఉంటే జైలుకు వెళతారని జోస్యులు చెప్పే మాటలు నమ్మేవారు ఇలా చేస్తున్నారు. చిప్పకూడు ముందుగానే తినేస్తే ఆ జైలుదోషం వెంటాడదని నమ్మడమే దీనికి కారణం. కొందరైతే ఏకంగా జైలుకే వెళ్లి ఒకటిరెండు రోజులు అక్కడే గడిపి వస్తున్నారట. కొద్దిరోజుల క్రితం ఉత్తరప్రదేశ్ సహారన్పూర్ జిల్లాకు చెందిన ఓ రాజకీయవేత్త జైలులో పెట్టే దాల్-రోటీ కావాలని అడిగితే అధికారులు సంతోషంగా పంపించారట.